Wednesday, July 24, 2019

కందుకూరి వీరేశలింగం సాంఘిక సంస్కరణలు - చారిత్రక నేపథ్యం

కందుకూరి వీరేశలింగం సాంఘిక సంస్కరణలు - చారిత్రక నేపథ్యం

కందుకూరి వీరేశలింగం ( 1848 - 1919 ) వంటి సంఘసంస్కర్తల సేవలకు నోచుకోవడం ఆంధ్రదేశం అదృష్టంగా భావించాలి. 19వ శతాబ్ది మధ్య కల్లా తన నిర్విరామ కృషివల్ల ఆంధ్ర ప్రజలలో విశాల భావాలను నెలకొల్పగల్గాడు.  చివరిదశలో ఆంధ్రదేశంలోనే మూఢాచారాలకు, సనాతన చాందస భావాలకు తావు లేకుండా పోయింది. కాలానుగుణమైన మార్పుల్ని గమనించి కొత్త భావాల్ని స్వీకరించేందుకు ఆంధ్రదేశం సమాయత్తమైంది. ఇదేకాక వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలు సామాన్య ప్రజలలో సైతం నవ చైతన్యం కలిగించాయి. ఇటువంటి సానుకూల పరిస్థితులను వినియోగించుకుని ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని చేసేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అందుకేనేమో ఆంధ్రులు కందుకూరి వీరేశలింగం గారిని గొప్ప సాంఘిక సంస్కర్తగా గుర్తించారు.
కందుకూరి వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు తండ్రి సుబ్బారాయుడు తల్లి పూర్ణమ్మ. తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం వల్ల తల్లి కొడుకును విద్యావంతుణ్ణి చేయాలనే పట్టుదలతో అతనిని ప్రభుత్వ జిల్లా పాఠశాలకు పంపింది. 1869లో వీరేశలింగం మెట్రిక్యులేషన్ పరీక్ష పాస్ అయ్యాడు. కోరంగిలో ఉపాధ్యాయుడుగాను, రాజమండ్రిలో సీనియర్ తెలుగు పండితుడుగాను వీరేశలింగం పనిచేశాడు.
వీరేశలింగం రచన సాహిత్యంలో తనదైన పద్ధతి అంటే పూర్తిగా సమాజానికి ఉపయోగపడే విధంగా తన రచనలను ముందుకు తీసుకు వచ్చాడు. తెలుగులో మొట్టమొదటి నవలయైన “ రాజశేఖర చరిత్ర “  గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో రచించిన వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే నవల ఆధారంగా రచించబడినది. రాజశేఖర చరిత్ర అ కన్నడ అ ఆంగ్లభాషలోకి అనువదించబడింది. లండన్ నుండి వెలువడే ది టైమ్స్ అనే పత్రికలో ఈ నవలను గూర్చి సమీక్షించడం జరిగింది. ఆంగ్లంలో వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ తెలుగులో రాజశేఖర్ చరిత్ర  ఇందులో కొన్ని కొన్ని పాత్రలు సంఘటనలు మొత్తం రెండు ఒకేలా ఉన్నా అందులోనే పేర్లు ( పాత్రలు ) మాత్రం కొన్ని కొన్ని సన్నివేశాలు మార్పు చేసి  వీరేశలింగం రచించడం జరిగింది. ఇది పూర్తిగా అనువాద రచన మాత్రమే కానీ తెలుగు వచ్చే సరికి కొంత మంది కవులు కొంతమంది సమర్థిస్తూ మరికొంతమంది విమర్శిస్తూ వచ్చారు.
మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడిగా పనిచేసిన పరవస్తు చిన్నయ సూరి ( 1806 - 1862 ) రచించిన “ నీతి చంద్రిక “ తెలుగు వచన సాహిత్యం లోని మొదటి ఉత్తమ రచన పేర్కొనవచ్చు.  సంస్కృత పంచతంత్రంలోని మిత్రభేదం, మిత్రలాభం అను మొదటి రెండు భాగాలు అనువాదమే నీతి చంద్రిక రచన. రచనా శైలి కృత్రిమంగాను, ఆడంబరముగాను సాగింది. వీరేశలింగం సంస్కృత పంచతంత్రంలోని మూడవ భాగమైన విగ్రహ తంత్రాన్ని అనువదించేందుకు పై శైలిని అనుకరించాడు. అయితే విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టం అని భావించిన వీరేశలింగం ఈ కృత్రిమ శైలిని వదిలి పెట్టాడు. అందువల్లనే పంతులుగారు సంధి తంత్రాన్ని ( పంచతంత్రంలో నాలుగవ భాగం ) సులభ వచనంలో వ్రాశారు. రాజశేఖర చరిత్ర అనే నవలను రచించి తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా నవలా రచనకు శ్రీకారం చుట్టాడు. జీవ శాస్త్రాలలోను, చరిత్రలోనూ మొదటి తెలుగు పుస్తకాలను ఆయనే రచించాడు. సత్యరాజా పూర్వ దేశయాత్రలు అనువాద రచన, సత్యవతీ చరిత్రము, ఈ రెండు నవలలు గాను; ,మార్కండేయ శతకం, శ్రీరాజమహేంద్ర పురవర గోపాల శతకం, మరియు రసికజన రంజనం మొదలగునవి పద్య కావ్యాలు. వ్యవహార ధర్మబోధిని , కాళిదాసు శాకుంతలం, రత్నావళి, దక్షిణ గోగ్రహణం, సత్య హరిశ్చంద్ర, మాళవికాగ్నిమిత్రము మొదలగునవి నాటకాలు. నీతి కథా మంజరి అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు. స్త్రీల కోసం ప్రత్యేకంగా వచన కవిత్వాలు రాసేవారు. సతీహితబోధిని , హాస్య వర్ధని వంటి మహిళా పత్రికల్ని స్థాపించడంలో కూడా వీరేశలింగం పంతులు మొదటి వారు అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య విమర్శ గ్రంథాల్ని రాయడంలోనూ, కవుల చరిత్రను రాయడంలోనూ పంతులుగారు మొదటి వారని చెప్పవచ్చు. వీరేశలింగం రచనలు తెలుగు సాహిత్యంలోని అన్ని రకాల ప్రక్రియలకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మొదటగా నిలిచిన వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
సాంఘిక సంస్కరణలు : స్త్రీ విద్య : 1870వ దశకంలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న ' ఆంధ్ర భాషా సంజీవని ', ‘ పురుషార్ధ ప్రదాయిని ' అను పత్రికల్లో స్త్రీ విద్యను గూర్చి వివాదం చెలరేగింది. ఆంధ్ర భాషా సంజీవని పత్రికకు మహా మహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులు సంపాదకుడిగా ఉండేవారు. ఈయన సాంప్రదాయవాది. పురుషార్ధ ప్రదాయిని పత్రికను మచిలీపట్టణం వాసియైన ఉమారంగ నాయకులు నాయుడు గారు నడిపేవారు. 1871లో ప్రారంభించబడ్డ ఆంధ్ర భాషా సంజీవని పత్రిక గ్రాంధిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషావాదాన్ని విమర్శించేది. ఈ నేపథ్యంలోనే వీరేశలింగం పంతులు స్త్రీ విద్యను సమర్థిస్తూ పై వివాదంలో భాగ స్వామి అయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు వివేకవర్ధిని అనే పత్రికను 1874లో రాజమండ్రిలో ప్రారంభించాడు. స్త్రీ విద్యను వ్యతిరేకించేవారిని అపహాస్యం చేస్తూ కవిత్వాన్ని చెప్పడమే కాక నాటికలు కూడా రచించాడు. ఇతని రచనయైన ' బ్రహ్మ వివాహం ' బాల్య వివాహాల్ని కన్యాశుల్కాన్ని తీవ్రంగా నిరసించింది. తన ఆశయాన్ని ఆచరణలో పెట్టేందుకు కందుకూరి 1874 సెప్టెంబర్ నెలలో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆంధ్రదేశంలోనే మొదటి బాలికల పాఠశాల కూడా ఇదే కావడం విశేషం. మల్లాది అచ్చన్న శాస్త్రి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. 1881లో రాజమండ్రి లోని ఇన్నీస్ ( ఇంగ్లీష్ ) పేటలో మరో బాలికల పాఠశాలను వీరేశలింగం స్థాపించాడు. సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో తనకు చేదోడువాదోడుగా ఉంటుందని తన భార్య రాజ్యలక్ష్మికి కూడా చదువు నేర్పించారు. బాలికల పాఠశాలలేకాక హరిజన పాఠశాలలు, శ్రామికులకై రాత్రి పాఠశాలల్ని స్థాపించింది కూడా వీరేశలింగంగారే. ఆంధ్రదేశంలో సహవిద్యను మొదట ప్రోత్సహించింది కూడా పంతులుగారే.
వితంతు పునర్వివాహాలు : 1874లో మద్రాసులో వితంతు పునర్వివాహాల సంఘాన్ని ప్రారంభించారు. దివాన్ బహదూర్ ఆర్ రంగనాథరావు, పి చంచల్రావు వంటి మద్రాసు నగర ప్రముఖులు సభ్యులుగ ఉండేవారు. కానీ ప్రారంభించిన రెండేళ్లకే ఈ సంఘం కనుమరుగైంది. 1875లో విశాఖపట్నం వాసియైన మహా మహోపాధ్యాయ పరవస్తు వెంకట రంగాచార్యులు వితంతు వివాహాన్ని సమర్థిస్తూ ‘ పునర్వివాహ సంగ్రహం ' అనే గ్రంథాన్ని రచించాడు. దీనిని చూసిన కొక్కొండ వెంకటరత్నం పంతులుకు కంపఠం పుట్టింది. రంగాచార్యులకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. వీరేశలింగంతో సంబంధాలు లేనప్పటికీ ఆయన సహాయాన్ని అర్థించాడు. కానీ వీరేశలింగం హృదయం వితంతువుల పైనే ఉంది. అయినప్పటికీ వితంతు వివాహం గూర్చి వాదోపవాదాలు తోనే సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆశయాల్ని ఆచరణలోకి తేవాలని ఆయన ఆరాటం. అందుకే ఎవరు పక్షమూ వహించకుండా కొంతకాలం గడిపాడు. 1875 కల్లా వీరేశలింగం పంతులు బ్రిటీషు ఉన్నతాధికారులతోను, మద్రాసు నగర ప్రముఖులతోనూ మద్రాసు రాష్ట్ర ఇతర పట్టణాల్లోని ప్రముఖులతోనూ సంబంధ బాంధవ్యాలని పెంచుకున్నాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధాన అధికారి ఈ.పి మెట్కాఫ్ వీరేశలింగం చేపట్టే కార్యక్రమాలలో ఉత్సాహం చూపించడమే కాక పంతులుగారి వివేకవర్థిని పత్రికకు చందాదారుడయ్యాడు. పంతులుగారి కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహం ఇచ్చాడు 1878 సెప్టెంబర్ నెలలో రాజమండ్రిలో ' సంఘ సంస్కరణ సమాజం ‘ స్థాపించబడింది.
1879 ఆగస్టు 3న మహారాజా బాలికల పాఠశాలలో వితంతు వివాహం పై మొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఉపన్యాసం ఆంధ్ర దేశమంతా సంచలనం సృష్టించింది.  ఇక్కడే అక్టోబర్ 12న మరో ఉపన్యాసం ఇచ్చాడు. దీంతో సాంప్రదాయవాదులలో కలవరం పుట్టింది. వీరేశలింగం వాదనల్ని ఎదుర్కోవడానికి రాజమండ్రి, కాకినాడ లో పోటీకి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ వితంతు వివాహం శాస్త్ర సమ్మతం కాదని నిరూపించలేకపోయారు. దీంతో వీరికి ఆవేశం ఎక్కువైంది. వీరేశలింగంను కొట్టించడానికి రౌడీలను ఉపయోగించారు. అయితే వీరేశలింగం శిష్య బృందం ఉక్కు కవచంలా ఆయన్ని కాపాడింది. 1880లో తన స్నేహితులైన చల్లపల్లి బాపయ్య, బసవరాజు, గవర్రాజుల సహకారంతో వితంతు పునర్వివాహం సంఘాన్ని పంతులుగారు స్థాపించారు. తనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని, వీరేశలింగం తన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఉపక్రమించాడు. వితంతువుల్ని వివాహం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. తన శిష్య బృందాన్ని మారుమూల ప్రాంతాలకు పంపి వీరికోసం వెతికించాడు. కానీ వితంతువుల తల్లిదండ్రుల్ని ఒప్పించడం చాలా కష్టసాధ్యమైంది. చివరకు ఒక వితంతువు తల్లి తన కుమార్తెకు వివాహం చేయడానికి ఉత్సాహం చూపింది. వెంటనే తన శిష్యుల్ని ఆ వితంతువు నివసించే పల్లెకు పంపి అతి కష్టం మీద ఆమెను రాజమండ్రికి తీసుకువచ్చారు. ఈ వితంతువు పేరు సీతమ్మ. 1881 డిసెంబరు 11న రాజమండ్రిలో గోగుల పాటి శ్రీరాములతో సీతమ్మ వివాహం జరిగింది. ఈ విధంగా ఆంధ్రదేశంలో లో మొదటి వితంతు వివాహం అగ్రకులంలోనే జరిపించడం విశేషం. ఈ పెళ్లి కూడా సవ్యమైన వాతావరణంలో జరగలేదు. రాజమండ్రిలోనే సాంప్రదాయ వాదులు ఈ పెళ్లిని చెడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పంతులుతో పాటు ఆయన శిష్య బృందం కూడా ఏ పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వివాహం జరిగే ప్రాంతం చుట్టుపక్కల పోలీసు బందోబస్తు చేయబడింది. తమ ప్రయత్నంలో విఫలులైన సాంప్రదాయ వాదులు పెళ్లిలో పాల్గొన్న 31 కుటుంబాల్ని కులం నుండి వెలివేశారు.
ఈ మొదటి వితంతు వివాహం జరిగిన నాలుగు రోజులకే ( డిసెంబర్ 15న ) రెండో వితంతు వివాహం జరిపించాడు వీరేశలింగం. రత్నమ్మ అనే వితంతువు రాచర్ల రామచంద్రయ్య వివాహం చేసుకున్నాడు. 1892 నాటికి 20 వితంతు వివాహాల్ని జరిపించాడు. వీరేశలింగం కార్యకలాపాలంన్నింటిలోనూ ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి కాకినాడ వ్యాపారవేత్త పైడి రామకృష్ణయ్య. వివిధ సందర్భాలలో లో మొత్తం 30 వేల రూపాయలు ఇచ్చి వీరేశలింగాన్ని ప్రోత్సహించాడు. పెళ్ళికాని వితంతువులకు, తల్లిదండ్రులచే విడవబడ్డ వితంతువులకు మద్రాసులోనూ ( 1897 ), రాజమండ్రిలోను (1905 ) వితంతు శరణాలయాల్ని కట్టించాడు. 1883లో స్త్రీలకు ప్రత్యేకంగా సతి హిత బోధిని అను మాసపత్రికను ప్రారంభించాడు.
బ్రిటన్ దేశస్తురాలు మానింగ్ అనే యువతి వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయానికి 50 పౌండ్లు చెందేటట్లు తన వీలునామాలో రాసి పెట్టింది. వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రభుత్వం 1893లో రావు బహదూర్ బిరుదు ప్రధానం చేసింది. 1898లో మద్రాసులో జరిగిన భారత సంఘసంస్కరణ సభకు అధ్యక్షత వహించి దేశంలోనే అత్యున్నతమైన గౌరవాన్ని పొందాడు. ఈ సభలోనే మహాదేవ గోవింద రనడే వీరేశలింగాన్ని దక్షిణ దేశ ఈశ్వరచంద్ర  విద్యాసాగరుడు గా అభివర్ణించాడు. 1899లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో మొదట తెలుగు పండితుడిగా వీరేశలింగం నియమింపబడ్డాడు. 1904లో ఉద్యోగ విరమణ చేసి తిరిగి రాజమండ్రికి వెళ్ళాడు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వితంతు శరణాలయాల్ని, అనాథశరణాలయాల్ని స్థాపిస్తూ తన కార్యక్రమాలను కొనసాగించారు. 1905 డిసెంబర్ 15న తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణకై ‘ హితకారిణి సమాజం ' అను కేంద్ర సంస్థను స్థాపించాడు. 1908 మే 2న హితకారిణీ సమాజాన్ని రిజిస్టర్ చేయించి దాదాపు 50 వేల రూపాయల విలువగల తన యావదాస్తిని సమాజానికి దత్తం చేశాడు.
వీరేశలింగం దేవదాసి పద్ధతిపై అవినీతిపరులైన ఉద్యోగులపై ధ్వజమెత్తాడు. సంఘంలోనే ఉన్నత వర్గాల వారు వేశ్యలను ఉంచుకోవడం గౌరవంగా భావించేవారు. వీరి ఇళ్లల్లోనే అధికార అనధికార నిర్ణయాలు కూడా జరిగేవి. అధికారుల నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేందుకు కొంతమంది ఈ దేవదాసిల్ని సాధనంగా వాడుకునేవారు. వివాహ సందర్భాల్లో దేవదాసీల చేత నాట్యం చేయించేవారు వీరేశలింగం ఈ దేవదాసీ పద్ధతిని నైతిక విలువల్ని దిగజార్చేదిగా ఉందని భావించి తీవ్రంగా వ్యతిరేకించాడు. రాజమండ్రిలోనే అవినీతి పరులైన అధికారుల గుట్టు బట్ట బయలు చేసి అధికార యంత్రాంగంలో భయోత్పాతాన్ని సృష్టించాడు వీరేశలింగం. ఈయన బయటపెట్టిన అవినీతికి భయపడి ఒక జిల్లా మున్సిఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రదేశంలో ప్రజా చైతన్యం ప్రారంభమైన సమయంలో కందుకూరి వీరేశలింగం కొన్ని కొన్ని ప్రాంతాలను సందర్శించి తాను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించి సమాజంలో జరిగే సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో కృష్ణాజిల్లా బందరులో గ్రహించారు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో లో ఆంధ్రులు ఆలోచనలలో కొత్త భావాలు మొలకెత్తాయి. 1857లో మద్రాసు విశ్వ విద్యాలయం స్థాపించడంతో ఆంధ్ర దేశంలో ఉన్నత విద్య అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. 1843లో పాశ్చాత్య విద్యా బోధనకు నోబెల్ నాయకత్వంలో లో చర్చి మిషనరీ సొసైటీ ( నోబుల్ కళాశాల ఇప్పటి సంస్థ ) మచిలీపట్నంలో ఒక పాఠశాలను స్థాపించింది. 1864లో ఈ పాఠశాల ఒక కళాశాల స్థాయికి ఎదిగింది. 1873లో మద్రాసు ప్రభుత్వం రాజమండ్రిలో ఒక సెకండరీ గ్రేడ్ కళాశాలను స్థాపించింది. 1877లో ఈ కళాశాలలోనే డిగ్రీ కళాశాలగా మార్చారు. 1878లో విశాఖపట్నంలో హిందూ కళాశాల  ( ఈనాటి ఏ. వి.ఎన్ కళాశాల ) స్థాపించబడింది. 1879లో బరంపురంలో కళ్ళికోట కళాశాలను స్థాపించారు. ఆంధ్రదేశంలో జరిగిన ఆంగ్ల విద్యావ్యాప్తి వల్ల ముఖ్యంగా సర్కారు జిల్లాల్లో పాశ్చాత్యుల స్వేచ్ఛ భావాల్ని అలవర్చుకున్న ఒక కొత్త విద్యావంతుల వర్గం ఏర్పడింది. వీరు సనాతన సాంప్రదాయలతో కూడిఉన్న ఆనాటి హిందూ సమాజంలో ఇమడలేకపోయారు. అందువల్ల ఆనాటి అధికార వర్గాన్ని అసంబద్ధమైన మతాచారాల్ని విమర్శించకుండా ఉండలేకపోయారు. దీంతో వీరు ఆనాడు తలెత్తిన రాజకీయ సాంఘిక ఉద్యమాలకు మూల పురుషులు అయ్యారు. కందుకూరి వీరేశలింగం గారు పైన తెలియజేసిన కళాశాల లన్నిటిలోనూ నెల రోజుల పాటు ఒక్కొక్క కళాశాలలో పునశ్చరణ తరగతులకు హాజరు అయ్యారు. సంఘంలో జరిగే అరాచకాలపై తిరుగుబాటు తత్వాన్ని బందరులోనే చవిచూశారు.
1910 ఆగస్టు 11వ తేదీన వీరేశలింగం తన జీవిత భాగస్వామియైన రాజ్యలక్ష్మిని కోల్పోయాడు. భార్య చనిపోవడం వల్ల వీరేశలింగం పంతులు మానసికంగా కృంగిపోయారు. అందుకు ముందే ( 1909లో ) తన ఆప్తమిత్రుడైన దేశిరాజు పెద బాపయ్య మరణించాడు. ఇటువంటి సమయంలో వీరేశలింగంపై ఆయన శత్రువులు లేనిపోని అపనిందలు వేశారు. దీంతోపాటు ఆయనపై పరువు నష్టం దావాలు కూడా వేశారు. అయితే వీటన్నింటి నుండి వీరేశలింగం విజయవంతంగా బయటపడ్డాడు. కానీ జీవితం పట్ల తనకు ఇది వరకు ఉన్న ఆసక్తిని కోల్పోయాడు 1919 మే 27న మద్రాసులో తన అంతిమ శ్వాస విడిచాడు.
కందుకూరి వీరేశలింగం పంతులు గారిని గూర్చి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
వీరేశలింగం పంతులు మధ్యయుగపు మత్తు నుండి ఆంధ్రుల్ని కదిలించాడు. వారి మూర్ఖత్వం పై కొరడా ఝళిపించారు. ఆంధ్ర విశ్వాసాల నుండి వారికి ముక్తిని ప్రసాదించాడు. వారి జీవితాలకు, ఆలోచనలకు ఆధునికమైన అభ్యుదయకరమైన మానవత్వపు విలువలు గల ఒక మలుపును చూపగల్గారు – “ వి ఆర్ నార్ల “
వీరేశలింగం పంతులు వారిలో చైతన్యాన్ని కలిగించినట్లయితే ఆంధ్ర దేశము , ఆంధ్ర ప్రజలు , ఈనాడు ఉన్న స్థితిలో ఉండేవారు కారు. సూక్ష్మబుద్ధి, ఎనలేని ధైర్యం, బహుముఖ ప్రజ్ఞ కలిగిన ప్రముఖులైన భారతీయుల్లో వీరేశలింగం ఒకరు. అసత్యం పై యుద్ధాన్ని ప్రకటించి సమాజ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు – “ రాజాజీ “
సమాజంలో తీవ్రమైన మార్పులు రావాలని కోరి అందుకోసమే నిర్విరామంగా కృషి చేసిన వీరేశలింగం పంతుల్ని దక్షిణ భారతంలోని మొదటి సంఘసంస్కర్తల్లో ఒకరుగా భావించవచ్చు. అయితే ఆనాడు అందరూ సంస్కర్తలు లాగానే పంతులు గారు కూడా అపార్ధాలకు వేధింపులకు గురయ్యారు. సాంఘిక పునరుజ్జీవనం కోసం ఎన్నో అవహేళనల్ని, అపాయాల్ని తట్టుకొని కృషిసల్పిన పంతులు గారి ఆదర్శానికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము.  – “ సర్వేపల్లి రాధాకృష్ణన్ “
ఆధునికాంధ్ర లోకంలో వీరేశలింగం పంతులు చాలా గొప్ప వ్యక్తి. వీరేశలింగం తన జీవిత చరిత్రలో యుగ వికాసాన్ని గూర్చి ఇలా వివరిస్తాడు. చాలామంది ప్రజలు తాము నివసిస్తున్న యుగపు వెలుగుల్ని ప్రసరింపజేయకనే తమ జీవితాన్ని కొనసాగిస్తారు. వారు వెలుగును ప్రసాదించనూ లేరు, గ్రహించనూలేరు. ఎవడైతే వెలుగును పట్టుకుని నవ చైతన్యాన్ని సృష్టించి సమాజంలో మార్పుకు అభివృద్ధికి కారకుడవుతాడో అతనే నిజమైన నాయకుడు. సమాజంలో మార్పు అభివృద్ధి జరగకపోతే మనిషి జీవితంలో జడత్వము, ఆందోళన చోటు చేసుకుంటాయి. నవ సమాజం నిర్మాతల్లో ఒకడు కావడంచేత వీరేశలింగం ఆధునిక యుగానికి అద్దం పట్టాడని చెప్పవచ్చు. పంతుల్ని సృష్టికర్త అన్నారంటే దీనికి కారణం ఆయన కూడా సృష్టిలో ఒక ప్రాణి కావడంవల్లే. ఎవరైతే తాము నివసించే కాలతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారో వారికే సృష్టి చేసే శక్తి కూడా ఉంటుంది. – “ కట్టమంచి రామలింగారెడ్డి “

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033543





ప్రశ్నించే తత్వం - బ్లాక్ వాయిస్

తంగిరాల సోని – బ్లాక్ వాయిస్
నేను చాలా పుస్తకాలు చదివిను కానీ చాలా రోజుల తర్వాత నన్ను ఆకట్టుకున్న పుస్తకం తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ చాలా చాలా బాగుంది ఈ రోజుల్లో కవిత్వం రాయాలంటే ద్వందార్థాలు మరియు పర్యాయపదాలు గానో నానార్ధాలు గానో అర్థం చేసుకోవలసి వస్తుంది కానీ ఈ కవిత్వం ఇప్పుడున్న వాడుక భాషలో చెప్పాలంటే చదువురాని వారికే త్వరగా అర్థమవుతుందని చెప్పవచ్చు. దీనిని మోటు కవిత్వం అని కూడా అనవచ్చు. ఇప్పటి కవులు చాలా కవిత్వాలలో తనదైన భాష, శైలి, అర్థం తమకు అనుగుణంగా రాసుకుంటున్నారే తప్ప ఇతరులకు త్వరగా అర్థమయ్యే రీతిలో ఎవరూ రాయడం లేదునిపిస్తుంది. బ్లాక్ వాయిస్ కవిత్వం అలా కాదు ఎవరు చదివినా సరాసరి ఆకట్టుకున్న శైలిలోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కవిత్వం చదువుతున్నంత సేపూ ఈ పదాలు మనం రోజు మాట్లాడుకునే మాటలే కదా అనుకున్న ఆ పదాలు రాయడానికి ఒక్కసారిగా ఎవరికి ఆలోచన తట్టదు. ఒక్క తంగిరాల సోని గారికి తప్ప. ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం సరదా కోసమో, పుస్తకాలు ముద్రించుకోవడం కోసమో, అవార్డుల కోసమో - పురస్కారాల కోసమో కాదు . దేశంలో జరిగే అరాచకాలపై అందులో దళితులపై జరిగే దాడులపై తంగిరాల సోనీ తమ కవిత్వాన్ని తిరుగుబాటు తత్వం ఉండేలా ఒక సంకేతాన్ని బ్లాక్ వాయిస్ రూపంలో ఎగర వేసాడు. దళితులపై ఎక్కడైనా దాడులు జరిగినా వెంటనే స్పందించి ఆ సంఘటనకు వెళ్లడం వెంటనే కవిత్వరూపంలో సోషల్ మీడియాలో పంపడం జరుగుతుంది కానీ, ఎక్కడైనా ఏసంఘటనలు జరిగినా మనకు ఎందుకులే అనేవాళ్లే చాలా మంది ఎక్కువ. కానీ సోనీ మాత్రం తన వాయిస్ ని వినిపిస్తాడు. అతనిలో గొప్ప విషయం ఏమిటంటే వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్లకు ధైర్యం చెప్పే వ్యక్తి.  అందులో స్త్రీలపై జరిగే అన్యాయాలపై ఎక్కువగా స్పందించి తన బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా ప్రశ్నించే తీరు, ఎదుర్కొనే తీరు, తిరుగుబాటుచేసే తీరు,  సరికొత్త గొంతుతో వినిపిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఈ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా అర్థమవుతుంది.
తల్లిదండ్రులు భారంగా భావించే పిల్లలు ప్రస్తుత రోజుల్లో చాలా సంఘటనలు చూస్తూనే ఉన్నాం . వయసుమళ్ళిన తల్లిదండ్రులను ప్రేమగా జీవితాన్ని కొనసాగించడానికి తమ పిల్లలు ముందుకు రాక పోవడానికి కారణం ప్రేమ నశించడమే. తల్లి పనిచేసే శక్తి ఉంటే అన్ని పనులు చేయించుకుని ఒక ముద్ద భోజనం పెట్టి తన పనేదో తనను చూసుకోమనేవారు ఒకప్పుడు ఉన్న ఇప్పుడు కనుమరుగవుతున్నారు. తల్లి తన బిడ్డలను ఎలా చూసుకునేదో అమ్మ ఒంటరి కవిత్వం ద్వారా మనకు చక్కని సందేశం ఇస్తున్నారు సోనీ. సమాజంలో ఆడపిల్లల పుడుతుంటే సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఇందులో ఆడపిల్ల నేను పుట్టగానే నన్ను భారంగా చూడలేదు కానీ  నేను పుట్టిన తర్వాత నాన్నచనిపోయాడని నన్ను అవమాన పరిచారు మా ఊరి ప్రజలు. అమ్మ ఎంత బాధ పడిందో నాకు తెలుసు నా చిన్నప్పుడు పందిరి గుంజకు ముతక చీర ఊయలగా కట్టి దానిలో పడుకోబెట్టి పరిగేరుకోవడానికి పొలం పోయేది. వస్తూ వస్తూ పరిగి గింజల్ని కోమట్ల కొట్టంలో వేసి చీరలో సోలెడు బియ్యం, రెండు ఉల్లిపాయలు, రెండు మిరపకాయలు, తీసుకుని గబగబా వస్తూ తలకు కట్టిన గుడను బిగదీసుకుంటూ వస్తుంటే వాడ మలుపు లోనే నా ఏడుపు గొంతు వినిపించి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంటే పక్కన ఉన్నవాళ్లు మీ పిల్ల దయ్యం పిల్ల ఆ గొంతుచూడు ఎలాఉందో ఊరు మొత్తం వినిపిస్తుంది ఆమెకు లేనిపోని చాడీలు చెబుతుండేవాళ్ళు. తల్లి తన బిడ్డను కళ్ళు తుడుస్తూ, తల నిమురుతూ, చీముడు తుడుస్తూ అలా ఆలోచించే అమ్మ అబిడ్డ ఎదిగేకొద్దీ అమ్మ అలా తగ్గుతూ ఉండేది అమ్మను వాటేసుకుని పడుకుంటే అమ్మ పేగులో సముద్రాల అలలు పోటెత్తిన శబ్దాలు వినిపించాయి నాకు. మూడు పూటలు అన్నం పెట్టి, అమ్మ కుంటల్లో నీళ్లు తాగి ఆకలని నింపుకునేది . “ నేను ఎదుగుతుంటే / అమ్మకు గుండెల్లో కలుక్కుమన్నట్టు వుండేది / నా సమర్తకు రైక ముక్కయినా / కొనలేని అమ్మ /  నేను బువ్వ తినందే తినని మా అమ్మ /  నన్ను సూడకుండా ఉండలేని అమ్మ /  ఇప్పుడు నాకు వయస్సు వొచ్చిందని / ఎవళ్ళనో నాకు కట్టబెట్టడానికి వెతుకుతుంది / కిందా మీదా పడి నాకు పెళ్లి చేసి / ఇప్పుడు నన్ను పంపేటప్పుడు / తన రెండు చేతులతో పాటు / అమ్మ ప్రాణాన్నే నేను తీసుకెళ్తునట్టుంది / అమ్మ నుండి నన్ను దూరం చేస్తుంటే / నాకు అమ్మే కావాలి అనిపించి / గుక్క పట్టి  ఏడ్చుకుంటూ వచ్చా / నేను లేకుండా నా పిచ్చితల్లి / యట్టా బతికిద్దో / నాకు తెల్వడంలా / ఇప్పుడు అమ్మ ఒంటరి.... ఇలా తల్లీ పిల్లల మధ్య చాలా సంఘటనలు మనము గుర్తు చేసుకోవచ్చు.
చాలామంది కవులు స్త్రీల అందాలను అణువణువు వర్ణించారే తప్ప! బాధలను ఎవరు వర్ణించలేదని  దేశంలో  స్త్రీలపై జరిగే సంఘటనలు బాదా తప్త హృదయంతో కలాలు కదిలించాలని తంగిరాల సోనీ బ్లాక్ వాయిస్ కవిత్వం ద్వారా తెలియజేశారు. నా నెత్తురుతో అనే కవితలో ఓ స్త్రీ ఆవేదనతో నాఅందాలు వర్ణించడానికి, ప్రతి అవయవాలు కొలవడానికి , మమ్మల్ని ఏవిధంగా చిత్రహింసలు పెట్టారో, ఎలా రేప్ చేశారో రాయడానికి మాత్రమే మీ కలాలు కదులుతాయి గాని, మా బాధలు  మా రోదనలు రాయడానికి మీ కలాలకు కుష్టురోగం వచ్చింది కదా ! మేము సమాజంలో రావాలి అంటే భయం, జీవించాలంటే భయం ఎక్కడ చూసినా మనుషుల్లో మానవత్వం చచ్చి , మృగం ఆవహించి పశువుల ప్రవర్తిస్తున్నారు. అదేమంటే ఇది చేసే పనికి అలాగే జరగాలని వేదమంత్రంలా పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ సరదాగా నా పై జోకులు వేసుకుంటూ అనరానీ మాటలతో చచ్చిన తర్వాత కూడా ఇది ఇలా అది అలా ఈ మాటల పోటులతో మమ్మల్ని చంపుతుంటారని, నానెత్తురుతో అనే కవితలో బాధను వ్యక్తం చేస్తూ.... “ నా దేహంపై కప్పుకున్న గుడ్డని తీసి / నాపై పొర్లడడానికే కలాలు కదులుతాయి.../  బయట మాత్రం మేం స్త్రీ వాదులం /  అని చెప్పే గొప్ప హింసావాదులు ఉన్న / పరమ కిరాతక పురుషులోకం.../  కప్పుకోండి... కప్పుకోండి...కప్పుకోండి... / నా శరీరం తోలు వొలిచి తయారు చేసిన / వజ్రాల శాలువాతో సత్కరించుకోండి / నా రొమ్ములు కొరికి సిరా నింపిన / కలాలు తీసుకోండి / నన్ను చంపి బంగారంతో తయారుచేసిన / పతకాల సర్టిఫికెట్లు అందుకోండి.../ మీక్కావాల్సింది నా పతనమే కదా / మీక్కావలసింది నా బానిసత్వమే కదా / మీక్కావలసింది నాపై పెత్తనమే కదా / మీక్కావాల్సింది నా శరీరమే కదా / ఒరే.. ఒరే.. ఒరే... /  తలతిప్పితేనే వరసకట్టి / హింసించే పరమ దుర్మార్గులారా / మీ ఇళ్లల్లో కూడా నేను ఉంటానని / మీరు కూడా నా నుండే వచ్చారని తెలుసుకోండి... ఇలా దేశంలో జరుగుతున్న దాడులకు నిరసనగా తంగిరాల సోనీ నా నెత్తురుతో అనే కవితలో స్త్రీ ల బాధలను వ్యక్తం చేశారు.
ఒకప్పుడు మనం కట్టేలతోనే భోజనం వండుకునే వాళ్ళం . రాను రాను గ్యాస్ - కరెంటుతో అలవాటైపోయింది మనకి. చెప్పాలంటే రోగాలు కూడా దగ్గర  అయ్యామే తప్ప మళ్లీ కట్టెలతో వండటం లేదు. పల్లెల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులు కలిసి వరిచేలల్లో పనికి వెళ్లి పనిచేసి వస్తూ వస్తూ కొన్ని కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారు . ఆకట్టేలు పచ్చివైనా, ఎండివైనా వీటితోనే వంట చేసేవారు . కట్టెలతో వండుకున్న భోజనం తింటే ఎలాంటి రోగాలకు దరిచేరనీయకుండా గ్యాస్ కు దూరంగా ఉంచుతాయి. పల్లెల్లో కట్టెలమోపు తీసుకువస్తున్నారంటే ఎక్కువమంది స్త్రీలే . అమ్మ కట్టెలమోపు తీసుకు వస్తూ వస్తూ ఈ కట్టెలమోపు అనే కవితలో అమ్మ చేసే పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది ... “ పొద్దున్నే పరగడుపున నీళ్లు తాగి / తలకు కట్టుకోవల్సిన తువ్వాలు ఒకటి తీసుకుని / చేతిలో కొడవలి పట్టుకుని / గబగబా ఇంటి తాడిక నెట్టి ) అందర్నీ లేపుకుని / పుల్లలు ఏరడానికి పోయేది అమ్మ.../ కంది కట్టే, పొగాకు కట్టే, పత్తి కట్టే / నెత్తిమీద మోస్తావుంటే / అంత బరువు యట్టా మోస్తున్నావే / అనీ.. ఊరిలో జనం నోరు ఎళ్ళబెట్టే వాళ్ళు / అమ్మ ఇంటి చుట్టూరా / తడిక కట్టిందంటే / ' ఎంత అందంగా కట్టివే '  అనీ / చుట్టు పక్కల వాళ్లు మురిసేటోలు.../  పరగడుపునే పుల్లలకు పోయీ / వస్తా వస్తా చీరచెంగులో రేగు పళ్ళు తెచ్చేది / నోట్లో వేపపుల్ల పెట్టుకుని / ఆకలని ఎండగడుతూ ఉండేది అమ్మ/ రాత్రుళ్లు సగం బువ్వతోనే / చెయ్య కడిగే మా అమ్మ /  పొద్దున్నే మంచినీళ్ళు తోనే కడుపు నింపుకునేది / వారంలో ఒక్కసారి అయినా సరిగ్గా / బువ్వతిందో లేదో కానీ.../  పనికి వంగిందంటే / యంత్రమైన వంగి దండం పెట్టాల్సిందే అమ్మకు... ఇలా అమ్మ పనితనం గురించి చక్కని సందేశం తన కవిత్వం ద్వారా తెలియజేశారు సోనీ గారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న మాట అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ చేసే పనులు గురించి, త్యాగాలు గురించి ఎంత చెప్పినా తక్కువేననిపిస్తుంది. నడక, నేర్పరి, శైలి , భాష అన్ని మొదటిగా అమ్మ దగ్గరేనేర్చుకుంటాము. కవిత్వాలు, నవలలు, కథలు మొదలగునవి ఏవైనా అమ్మ గురించే ఎక్కువగా రాస్తుంటారు రచయితలు . అలాంటి అమ్మ గురించి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే అమ్మ విలువ తెలిసిన వారికి ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ గురించి చులకనగా మాట్లాడినా , దూషించినా బిడ్డలు తిరగబడతారు లేదో తెలియదుగానీ కచ్చితంగా తల్లి తిరగబడాలి అని సోనీ గారు చెప్పే అమ్మ కవిత్వంలో... పొడిచే పొద్దు కన్నా అమ్మ ముందే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి పేడ నీళ్లు చల్లి  చట్టేలో గిద్దెడు బియ్యం పోసి కట్టె పొయ్యలో ఉడుకుతుండగా బయట దొరగారి పిలుపుకి కాలిన సాసరను పక్కన పెట్టి ఏందయ్యగారు పిలిచారు అనేలోపే దొరసాని ఇంట్లోంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. ఇంకా రాలేదేమిటా అని నీకోసం ఎదురు చూస్తున్నా ఇంట్లో పనంతా చేసి ఆ చద్దికూడు తీసుకొని వెళ్ళు అని చెప్పి దొరసాని మళ్ళీ పడుకుంది. పనంత చేసేసరికి సాయంత్రం అయింది. పని చేసి వస్తూ వస్తూ కొంతమంది దారిలో అరుగులమీద దొరలు పంచలు సర్దుకుంటూ, పళ్ళు నూరుతూ , కండ్లు కొడుతూ, రొమ్ము ఇరుస్తూ, పళ్ళు పెదాల మీద కొరుకుతూ... “ ఏందే..! / నీ మొగుడు సచ్చాక .. / చాలా వొళ్ళు చేశావంటూ / సరసాల మాటలు మాట్లాడుతున్నారు../ కాగుతున్న నూనెలో ఎయ్యాలి / ఈ దొరగాండ్లను అంటూ / తల దించుకొని నడుస్తుంది అమ్మ.../ ఆకలితో పేగులు మాడిన డొక్కలో / వాడికి సౌందర్యం కనబడిందంట...! / అలసి సొలసి పనులతో నిద్రలేమి నా కళ్ళల్లో / కామపు చూపులు కనపడిందంట / పాలురాని నా రొమ్ములో / వాడికి నయాగరా జలపాతాలు కనపడ్డాయంట..!/ ఈ.. దొరగాండ్లకు.../ ఒక్కపూట బువ్వ లేకపోతే..!  బతకలేని వెధవలు../ దొరసాని ముందుకెళ్తే../ దొరగారు కుక్క పిల్లలా, కుక్కిన పేనులా పడుండాలి.../ బయట రోషంలేని మీసం మెలేస్తారు / గాంభీర్యం ప్రదర్శిస్తారు... అంటూ నా మొగుడు ఇంటా మగాడే బయట మగాడే మా ఆయనకి దేనికి చాలరు ఈ దొర గాండ్లు . మా ఆయన పొలం పనికి పోతే పని చిటికలో అయిపోతాది. మా ఆయన పని చేసి బయటకు వస్తుంటే ఈ దొరగాండ్లు రెండు చేతులు తీసుకువెళ్లి రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని కూర్చుని భయపడుతూ తలదించుకుని చూస్తుంటారు . నా మగాడు పేరు చెబితే మీకు పంచెలు తడవాలా అంటూ ... ఏడుస్తున్న పిల్లాడ్ని ఎత్తుకొని ముద్దాడుకుంటూ.. గుమ్మంలో కూలబడి తన రొమ్ములో రాని పాలు ఇస్తూ బిడ్డలో వాళ్ళయ్యను చూసుకుంటూ మురిసిపోతోంది అమ్మ...!
తంగిరాల సోనీ గారు దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు గద్గద స్వరంతో వినిపించిన బ్లాక్ వాయిస్ కవిత్వంలో ఎక్కువ శాతం స్త్రీవాద కవిత్వమే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రతి స్త్రీలో మన ఇంట్లో స్త్రీలతో సమానంగా చూడాలని సరికొత్త గొంతుతో స్త్రీవాద భావజాలాన్ని ఈ సమాజం అందిపుచ్చుకోవాలని స్త్రీలపై జరిగే దాడులలో గృహహింస, హత్యాయత్నం , చులకన భావన,  బానిసత్వం నీటి నుండి స్వేచ్ఛగా ప్రజలకు తమకు తాము నచ్చే విధంగా నడుచుకోవాలని, ఇంటి పనికి , వంట పనికి పరిమితమైన స్త్రీలు స్వేచ్ఛ సమాజంలోకి అడుగుపెట్టడానికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్య్రం లో స్త్రీలకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రూపొందించిందని తంగిరాల సోని కవిత్వం బ్లాక్ వాయిస్ ద్వారా వినిపించారు.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534

అమ్మ కోసం

అమ్మ కోసం
ప్రపంచంలో ఎవరంటే ఇష్టం అంటే మొదటగా చెప్పేది అమ్మ పేరు మాత్రమే. ఎందుకంటే సర్వం అమ్మ ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదా అంటే కనిపిస్తుంది కానీ అమ్మ ప్రేమలా బయటకు వ్యక్తమవ్వదు. ఇలాంటి ప్రేమలు రానున్న రోజుల్లో చూడడానికి కనుమరుగైపోతాయెమో? ఈ సృష్టిలో తల్లిదండ్రులను మించిన ప్రేమ మరొకటి ఉండదేమో! ఈ వ్యక్తి చాలా మంచివాడు చాలా వినయంగా నడుచుకుంటాడు అంటే వాళ్ల తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం అలాంటిదని సహజంగా ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. మా తల్లిదండ్రుల పెంపకంలో కూడా నేను అలాగే పెరిగాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు. మాకు ఇరవై ఎకరాల పొలం ఉంది. ఈ ఇరవై ఎకరాల పొలాన్ని మా నాన్న ( గోపాలరావు ) గారు ఒక్కరే సాగు చేసేవారు. నేను చిన్నప్పుడు పొలంలో ఉన్న మా నాన్నగారికి అన్నం పట్టుకెళ్లేవాడిని. మా నాన్నగారు పొలం పనులు చేస్తుంటే నేను కూడా చేయాలని పొలంలో దిగి పని చేస్తుంటే నీకు ఎందుకు నాన్న ఈ పొలం పనులు, చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకో అని ప్రతిరోజు చెబుతుండేవారు. నేను పదవ తరగతిలో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు అప్పుడు నేను పొలం పని చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా అమ్మ ( అన్న పూర్ణమ్మ ) నాన్న మాట ప్రకారం పైచదువులు చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోమని చెప్పారు కదా! చక్కగా చదువుకో నాన్న అని బ్రతిమలాడి చెప్పింది. అప్పటి నుండి నాకు అమ్మ మాటలే నాకు మా ఊరిలో మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టింది. అంతేకాదు అందరికంటే ఎక్కువగా చదువుకున్నది నేనే. మా ఊరిలో చాలామంది పది పాసైన వారు ఉన్నారు కానీ ఎక్కువగా పొలం పనులకు వెళ్ళి పోతూ ఉండేవారు. కానీ మా అమ్మ నా  పై చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చదివించింది.
నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండగా నాకు పెళ్లి సంబంధాలు చూడమని పక్క ఊర్లో ఉన్న దూరపు బంధువులకు చెప్పింది అమ్మ. అమ్మాయి ( పెళ్లి కూతురు )ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మా అబ్బాయిని జీవితాంతం చక్కగా చూసుకోవాలి. ఇలా మా ఊళ్లో ఎవరు కనబడిన ఇలాగే చెప్పేది అమ్మ. ఏదైతేనేం నా పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా చేసింది. నా భార్య పేరు సాహితి. సాహితీ అనే పేరులోనే మంచి సాహిత్య విలువలు ఉంటాయని మా అమ్మ పెళ్లి కార్డు చూసినప్పుడు చెప్పింది. నాకు పెళ్ళైన మూడు నెలలకి నాకు ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు రమ్మని బాగా ఒత్తిడి చేశారు. మీకు ప్రభుత్వ ఉద్యోగం పై వచ్చే జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్లు కాల్ లెటరు చేతిలో పెట్టి  వారంలో మీరు ఉద్యోగానికి వచ్చేది , రానిది  విషయాన్ని తెలియజేస్తారని చెప్పి వెళ్లిపోయారు.  అప్పుడు మా అమ్మగారు ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం ఉంది హైదరాబాదు ఎందుకు వద్దులే అంది అమ్మ. నా మనసులో ఉన్న మాట కూడా అదే. ఇంతలో మా అత్తగారు , నా భార్య సాహితి అమ్మగారు ఇంతకంటే మంచి జీతం మరెక్కడా సంపాదించుకోలేరు. ప్రస్తుతం ఉన్న జీతం కంటే మూడు రేట్లు ఎక్కువగా ఇస్తున్నారంటే ఇంతకంటే ఏముంది అని ఆ టీవీ ఛానల్ గురించి గొప్పగా చెప్పింది. అసలు నేను టీవీ ఛానల్ కి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రస్తావన టీవీ ఛానల్ వరకు ఎందుకు వెళ్ళింది అని ఆరా తీయగా మా అత్తగారు బంధువులు ఆ టీవీ ఛానల్ వాళ్ళకి గొప్పగా చదువుకున్న వ్యక్తి, సామాజిక అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి అని  నా పేరు వాళ్ళకి తెలియజేశారని తెలిసింది. ఇంతలో నా భార్య కూడా హైదరాబాద్ వెళ్దాం అండి హైదరాబాదు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. దయచేసి ఒప్పుకోండి అని ఒత్తిడి చేసింది. ఊళ్లో చాలామంది ఇంత పెద్ద జీతం వస్తుంటే వెళ్ళండి అని చెప్పారు. కానీ నా మనసు అంగీకరించలేదు. చివరకి మా అమ్మగారిని కూడా నా భార్య ఒప్పించింది. హైదరాబాద్ వెళ్దామని అన్ని సర్దుకున్నాం . ఇంతలో మా అమ్మగారు నేను రావడం లేదు నాన్న ఇక్కడ పొలం ఇల్లు చూసుకోవాలి మీరు సంతోషంగా వెళ్ళండి అని చెప్పింది. మీరు రాకపోతే నేను రాను అమ్మా! మేము ఇక్కడే ఉంటాం. అని చెప్పగా ఇంతలో అమ్మ ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చి మన ఇంట్లో ఎవరైనా ఉండడానికి వస్తే నేను వస్తాను బాబు అని చెప్పింది. అయినా నేను వెళ్లకుండా ఉండిపోయాను కానీ నా భార్య వారం రోజులుగా బిక్కమొహం వేసుకుంటూ సరిగ్గా అన్నం తినకుండా ఉంది. మా అమ్మ మమ్మల్ని బలవంతంగా హైదరాబాదుకు పంపింది.
హైదరాబాద్ లో ప్రముఖ టీవీ ఛానల్ లో నా ఉద్యోగం అయినప్పటికీ మనసంతా అమ్మ మీద ఉంది ఎందుకంటే అమ్మను వదిలి ఇంత దూరం రాలేదు. వీళ్లు ఇచ్చే జీతం కంటే అమ్మ మాటలే చాలా విలువైనదని తెలుసుకున్నాను. సంవత్సరానికి పాప పుట్టింది. అంతులేని సంతోషం అచ్చం అమ్మ లా ఉందని. పాపను తీసుకునే మా ఊరు వెళ్ళాం. మా అమ్మ కూడా  సంతోషపడుతూ మా మనవరాలు చూడు ఎంత చక్కగా ఉందో అంటూ వచ్చే పోయే వాళ్లకు చూపెడుతుంది. ఇంతలో నా భార్య సాహితి  పాపను అలా అందరికీ చూపించకూడదు అని మా అమ్మతో చెప్పింది. అందుకు అమ్మ అందరికీ అంటే ఊళ్లో వాళ్లు పరాయి వాళ్ళు కాదు అందరూ మనవాళ్ళే అని చెప్పింది అమ్మ. మా ఊరిలో ఒక వారం రోజులు ఉండి తర్వాత హైదరాబాద్ వచ్చేశాం. నేను మా ఊరికి వెళ్లడం తగ్గించేశాను. అప్పుడప్పుడు అమ్మ వస్తూ ఉంటుంది. నేను ఉదయం వెళితే మళ్లీ రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చే వాడిని. ఇలా ప్రతి రోజు నేను చేసే పని ఏమీ లేకపోయినా నా బిజీ షెడ్యూల్ లో ఉన్నట్టుగా ఉండిపోయేవాణ్ణి.
హైదరాబాదులో సొంత ఇల్లు,  కార్లు ఉన్నాయి. మా ఊర్లో ఉన్న ఇల్లు పాతబడి పోయింది. పొలాన్ని కౌలుకిచ్చి మా అమ్మగారిని హైదరాబాద్ తీసుకు వచ్చాను. మా అమ్మ  ఒక నెలరోజులు ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బందిగా బాధపడింది. ఎందుకంటే సొంత ఊరు వదిలి ఇంతవరకు ఇన్ని రోజులు లేదు. మేము సినిమాలకి,  షికార్లకి వెళ్ళేటప్పుడు మా ఆమ్మ బయటకు వచ్చేది కాదు. ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. మేము బయటి నుంచి వచ్చేసరికి వంటపని, ఇంటిపని చక్కగా చేసేది. అమ్మ చేతి వంట అంటే చెప్పేదేముంది. బయట తిన్న తృప్తి ఉండదు. ఏదైనా అమ్మ వంట అమృతమే! అమ్మ రాకముందు మా ఇంట్లో ఇద్దరు పని వాళ్ళు ఉండేవారు. పల్లెల్లో పొలం పనులు చేసే వాళ్ళు ఇంట్లో చాలా చక్యంగా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో ఐదు మంది చేసే పని, పల్లెల్లో పొలం పనిచేసేవాళ్ళు ఒక్కరితో సమానం. మా అమ్మ ఇంటికి వచ్చిన ( హైదరాబాద్ ) తర్వాత నా భార్య సాహితీ, నా కూతురు ఆమని ఇంతవరకూ ఇంట్లో ఎలాంటి పనులు చేయలేదు. నా భార్య సాహితి పల్లెటూర్లో ఎలా ఉందో దానికి భిన్నంగా ఉంది. ఆమెతో పాటు నా కూతురు ఆమని కూడా ఇలానే ఉంది అంటే సిటీ లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి ఆటలోనే చూసి వస్తారు. పైగా విపరీతమైన షాపింగ్ చేసి వస్తారు. నా కూతురికి పాతికేళ్లు దాటిన బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది.
ఒకసారి అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాము. అక్కడికి మా ఊరి వాళ్ళు వచ్చారు . మా అమ్మను కూడా తీసుకు వస్తే చాలా సంతోష పడేదేమో అని మనసులో అనిపించింది. మేము బయటకి వెళ్ళిన ప్రతిసారీ అమ్మ వచ్చేది కాదు అలా అని ప్రతిసారి మేము అడిగే వాళ్ళం  కాదు. ఈసారి ఎందుకనో అడగకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాను. మేము ఇంట్లోకి వెళ్లేసరికి అమ్మ కిందపడి అటు ఇటు కొట్టు కుంటూ ఉంది. గబగబ హాస్పిటల్కి తీసుకు వెళ్లాను. అమ్మకు పక్షవాతం వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఒక కాలు ఒక చేయి పనిచేయడం లేదు. ఒక వారం రోజుల తర్వాత డాక్టర్ ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పారు. అమ్మను ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత నా భార్య కూతురు ఇద్దరు బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు. పాపం చాలా బాధ పడుతున్నారని అనుకున్నాను. కానీ వాళ్లకు వంట చేసే వాళ్ళు లేరని అందుకు బాధ పడుతున్నారని చెప్పారు. ఆ రెండో రోజు నుంచి నేను పని మనిషి పెట్టాను. కానీ పనిమనిషి అన్ని పనులు చేయలేదని గ్రహించాను. నా భార్య , కూతురు ఇద్దరు బయటకు వెళ్లేముందు అందంగా తయారు అవ్వడానికి మా అమ్మ కొన్ని కొన్ని వస్తువులు అందిస్తూ ఉండేది. ఇప్పుడు వారిద్దరికి అందించేవాళ్ళు కూడా మనుషులను పెట్టమని ప్రతిరోజు నస పెట్టేవారు. అమ్మను చూసుకోవలసిన వీళ్లిద్దరు, వీళ్లిద్దరు చూసుకోవడానికి మరో ఇద్దరు పని మనుషులు కావలసి వచ్చింది. ప్రతి రోజు నేను ఆఫీస్ కి వెళుతున్నానే తప్ప ఆలోచనలన్నీ అమ్మ కోసమే. అమ్మకు వచ్చిన వ్యాధిని మందులతో కొంతకాలం వరకు తగ్గించినా, ఆప్యాయంగా పలకరించి మనస్ఫూర్తిగా సేవ చేస్తేనే అమ్మ త్వరగా కోలుకుంటుందని నా మనసులో నేను అనుకున్నా కొంతమంది మిత్రులు చెప్పిన ఆలోచనలు కూడా ఇదే.
నేను ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో ఎవరూ లేరు మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట్లాడలేని పరిస్థితి.  అమ్మకి అన్నం తినిపించి మందులు వేసి మళ్లీ పడుకోబెట్టాను. ఇంతకీ మా అమ్మ రోజూ అన్నం తిని మందులు వేసుకుంటుందా లేదా అని ఒక ఆలోచనలో ఉండిపోయాను. ప్రతిరోజు అమ్మకు అన్నం ఎవరు తినిపిస్తున్నారు? మందులు ఎవరు వేస్తారు అని చిన్న సందేహం వేసింది. ఇంతలో నా భార్య, కూతురు వీరిద్దరితో పాటు పని మనిషి కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్లారని అడిగాను. సినిమాకి వెళ్ళామని నా కూతురు సమాధానం చెప్పింది. మా అమ్మకు అన్నం తినిపించి మందులు వేస్తున్నారా అని అడిగాను. నేను మీ అమ్మగారికి ఈ సేవ చేయలేను సార్ ఇంట్లో పని మొత్తం చేస్తున్నాను అని సమాధానం చెప్పింది పనిమనిషి. నేను జీతం ఇచ్చి వేరే పని మనిషిని కూడా పనికి రావద్దని చెప్పి పంపించాను. నా భార్య సాహితీ, కూతురు ఆమని పని మనుషులు లేకపోతే మేము ఎలా బతకాలి? కనీసం మీ అమ్మకు సేవ చేసేవారైనా కావాలి కదా! దయచేసి పనిమనిషిని పెట్టించండి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చెబుతూ వచ్చారు. ఇంట్లో మీ ఇద్దరే పని చేయాలి మా అమ్మగారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని గట్టిగా చెప్పాను. నా భార్య సాహితి నేను మా ఇంట్లోనే ఇంతవరకు పనిచేయలేదు. అలాంటప్పుడు మీ అమ్మగారికి సేవ చేయడానికి ఎలా ఒప్పుకుంటానని  అనుకున్నారు. ఇంతలో నా కూతురు ఆమని కూడా చూస్తూ చూస్తూ ముసలివావళ్ళను ఎలాపట్టుకుంటారు డాడీ ! అయినా  ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తే నెలకు ఒక సారి, రెండు నెలలకోసారి పోయి చూసి రావచ్చు డాడీ దయచేసి ఇంట్లో వద్దు డాడీ ! అని చెప్పేలోపే మా ఆవిడ సాహితీ కూడా నాకు తెలిసిన వాళ్ళు , వాళ్ల పేరెంట్స్ ను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వేశారు. మనం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే వేద్దాం అని చెప్పగానే నాకు ఎప్పుడూ రాని కోపం వచ్చింది. వీళ్లు ఇలా తయారవడానికి కారణం కూడా నేనే ప్రధాన వ్యక్తిని. వీరిద్దరు సినిమాలకు షికార్లకు వెళుతుంటే ఎందుకు రోజు అని ఆరోజు ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదేమో? అని మనసులోనే అనుకున్నాను. పని మనుషులు లేకపోవడం వల్ల ప్రతిరోజు వీరిద్దరు బయటకు వెళ్ళి టిఫిను, భోజనం చేసి వస్తారు. నేను మా అమ్మ గారిని వదిలిపెట్టి  ఆఫీసు కూడా వెళ్ళలేక పోతున్నాను. ఒక వారం రోజులు వరకు నేనే వంట చేసి అమ్మకు అన్నం పెట్టి, మందులు వేసేవాడిని. ఈ వారం రోజులు గమనించిన నా భార్య,  నా కూతురు మీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. ఆఫీస్ కి వెళ్ళకుండా ఇలా రోజు సేవలు చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది చిప్పకూడే (అడుక్కు తినాలి ) అని నా భార్య చెప్పగానే కోపం వచ్చింది. అందుకు నా కూతురు ఆమని కూడా ఎందుకు అలా మా వైపు కోపంగా చూస్తారు. అప్పుడు నాకు మనసులో అనిపించింది అమ్మకు పక్షవాతం వస్తే పని చేయాల్సిందల్లా పోయి ఇలా మాటలతో చంపుతారా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా అనుకోని సందర్భాలు వస్తే లోపలున్న కపట ఆలోచనలు బయటకు వస్తాయని ఊహించలేదు. ఇలా మాకే జరుగుతుందా? ఎవరికైనా జరుగుతుందా అని లోలోపల అనుకున్నాను. కానీ బయట ప్రపంచం కూడా ఇలానే ఉందని కొంతమంది మిత్రులను అడిగి తెలుసుకున్నాను. ఏదేమైనా నా భార్యకు, నా కూతురుకు మా అమ్మ గారు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. కానీ నేను ఆఫీసుకి ఎక్కువగా సెలవులు పెట్టి అమ్మగారిని డాక్టర్కు చూపించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని. కొన్ని రోజులకు మా అమ్మగారికి ఆరోగ్యం కుదుటపడింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే మా అమ్మగారు నడుస్తున్నారు,  మాట్లాడుతున్నారు. కానీ ఇది వరకు ఉన్న చలాకితనం ఇప్పుడు లేదు కొద్దిగా నీరసంగా ఉంటుంది. నేను ఆఫీసుకు వెళ్ళగానే మా అమ్మగారిని నా భార్య, నా కూతురు తిడుతూ ఉండేవారని నేను గ్రహించాను. నేను ఆఫీస్ కి వెళ్లి రాగానే ప్రతి రోజు మా అమ్మగారు నేను మన ఊరు వెళ్ళిపోతాను అని ప్రతిరోజూ చెబుతూ ఉండేది. నా భార్య మాత్రం మన ఇంట్లో మీ అమ్మ ఒంటరిగా, బాధగా ఆలోచించే కంటే మీ ఊరికి పంపించడం చాలా మంచిదని చెప్పింది. అయినా నేనేమీ పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఏడుస్తూ నేను మన ఊరికి వెళ్లి పోతాను నాన్న ! నన్ను పంపించు చెప్పగానే కనిపించే వ్యాధి కన్నా కనిపించని మనోవ్యాధి మనిషిని మరింతగా బాధింప చేస్తుందని అనుకున్నాను. ఈ లోపు నా భార్య నా కూతురు వచ్చి మీ అమ్మగారిని ఊరికి పంపిస్తారా? మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్లిపోమంటారా? అని చెప్పగానే ఇప్పుడు ఏమైంది అందరూ కలిసే కదా ఉండేది? అని నేను చెబుతుండగా మీ అమ్మగారు ఇంట్లో ఉంటే మేము క్షణం కూడా ఈ ఇంట్లో ఉండమని నా భార్య కూతురు ఇద్దరు చెప్పి వరండాలో కూర్చున్నారు. మా అమ్మగారు నాన్న నావల్ల ఇబ్బందులు వచ్చినా , రాకపోయినా తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు కష్టంగా భావించడు.  కుటుంబం అంటే మొదట భార్య, పిల్లలు తర్వాతే ఎవరైనా!  నీవు కోడలు సాహితీని, మనవరాలు ఆమని వాళ్ళు మనసులను కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో నన్ను మాత్రం మన ఊరికి పంపించు ఇప్పుడే అని బట్టలు సర్దుకుని వచ్చింది మా అమ్మగారు.
నేను మా అమ్మగారిని తీసుకుని మా ఊరికి వెళ్ళాను. మా ఇల్లు పాతబడి కూలిపోయింది. తెలిసిన వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంచి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. కానీ నా భార్య సాహితీ, నా కూతురు ఆమని ముఖాల్లో ఏదో చెప్పలేని ఆనందం హావా భావాలు కనిపించాయి. కానీ ఇంట్లో వంట చేసి చాలారోజులైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరు బయట తిని ఇంటికి పడుకోవడానికి మాత్రమే వస్తారు. నేను కూడా ఆఫీస్ క్యాంటీన్ అలవాటు చేసుకున్నాను. మాఇంట్లోనే వీరిద్దరికి భారంగా ఉన్న మాఅమ్మ అక్కడ వాళ్లకు మాత్రం భారంగా ఉంటుందేమోనని రోజు భయపడుతూ ఉండేవాడిని. ఆఫీసు పని మీద ఒక నెల రోజుల పాటు వేరే ఊరు వెళ్ళాడానికి ఫ్లైట్ టికెట్ లు బుక్ చేసుకున్నాను. ఈ టిక్కెట్లు నా భార్య సాహితీకి, నా కూతురు ఆమని చూపించాను. వీళ్లిద్దరు మీరు ఎక్కడికైనా వెళ్లండి కానీ మాకు నెలకు అయ్యే ఖర్చులు రెండింతలు ఇచ్చి వెళ్లండని చెప్పారు. ఈ కావలసినవి ఇప్పుడే తీసుకోండి అనగానే రెండు ఏటీఎం కార్డులు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వరకు వచ్చారు. నేను వాళ్లకు ఫ్లైట్ టికెట్ లు వేరే దేశం వెళ్తున్నానని చూపించాను కానీ నేను మా ఊరికి బయలుదేరాను. ఎందుకంటే అక్కడ మా అమ్మగారికి ఎలా ఉందో అని రోజూ భయపడుతున్నాను. నేను మా ఊరికి కి రానే వచ్చాను. అంతగా భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే  పల్లెటూర్లో కొంతైనా ప్రేమ బ్రతికే ఉంది. నా భార్య నా కూతురు పెట్టిన హంస కంటే పల్లెల్లో స్వేచ్ఛగా బతకడం చాలా సులభం. ఎంతోకొంత అయినా పల్లెల్లోనే మానవత్వం ఉందని ఇక్కడ చూసి తెలుసుకున్నాను.
మా ఊరిలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న చల్లటి వాతావరణం. అందుకేనేమో పెద్దలు సిటీ కి రారు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేరు. మా పాత పడ్డ ఇల్లును పడగొట్టి  జమ్ము గడ్డితో చిన్నఇల్లు కట్టించాను. ఆ జమ్ము గడ్డి ఇల్లు  ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక్కడ అమ్మను చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఇద్దరినీ మాత్రం చూసుకోమని వాళ్లకి  నెల జీతంగా ఇస్తానన్నా వాళ్ల మనసు అంగీకరించలేదు. ఎలాగో మా పొలం కౌలుగా చేస్తున్నారు కాబట్టి ఎంతోకొంత ఆ సమయంలో ఇస్తే సరిపోతుందని అనుకున్నాను. నేను హైదరాబాదు నుండి ఊరికి వచ్చేటప్పుడు ఏటీఎం కార్డులు, చెక్కులు బ్లాక్ చేశాను. ఇంట్లో పది వేల రూపాయలు మాత్రమే  ఉంచాను. వేరే దేశం వెళుతున్నాను అక్కడ ఫోను కలవక పోవచ్చు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చాను. ఎందుకు అలా చేశాను అంటే ఇద్దరికీ తినడానికి పదివేల రూపాయలు ఒక నెల రోజులు సరిపోతుందని భావించాను. పేదవాడి కుటుంబానికి అయితే ఈ పదివేల రూపాయలు నెలరోజులకి చాలా ఎక్కువ. మా అమ్మగారు నేను  ఊరిలో నెలరోజులు ఉన్నంతవరకు నా భార్య సాహితీ , నా కూతురు ఆమని గురించి  పదే పదే ఆలోచించింది. నన్ను అక్కడికి వెళ్లిమని చాలా సార్లు చెప్పింది.
నేను హైదరాబాదు తిరిగి వెళ్ళగానే నా భార్య నా కూతురు కోపంగా చూసారు కానీ ఏమీ అనలేదు. ఆమని నా దగ్గరకు వచ్చి డాడీ మీరు మమ్మల్ని మోసం చేశారా? లేక బుద్ధి చెప్పారో తెలియదు కానీ మేము షాపింగ్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు చూపిస్తే డబ్బులు లేవని తెలిసింది. అక్కడ మాకు పరువు పోయిందని గ్రహించాము. తిట్టుకుంటూ ఇంటికి వచ్చి కనీసం తినడానికే డబ్బులు ఉన్నాయో లేవో అని అక్కడక్కడ వెతకగా పదివేల రూపాయలు కనిపించాయి తినడానికి సరిపోతాయి అనుకున్నాము. బయట భోజనం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు వచ్చాయి మూడు రోజులు పస్తులు ఉన్నామని చెప్పింది. నేను లోలోపల బాధపడ్డా అమ్మకి జరిగిన భోజనం విషయంలో అంత బాధ అనిపించలేదు. వీరిద్దరు పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నారే తప్ప  లోపల నామీద కోపం అలానే ఉంది. ముందున్న అహం మాత్రం ఇప్పుడు లేదని నేను గ్రహించాను.
రెండు నెలల తర్వాత మా ఊరి నుంచి ఫోన్ వచ్చింది మా అమ్మగారు చనిపోయారని. మన ఊరు వెళ్దామని నా భార్య సాహితికి, నా కూతురు ఆమనికి చెప్పాను. కానీ ఇద్దరూ రానని చెప్పారు. వీళ్లు మారరు అని మనసులో అనుకున్నాను. ఈ ఒక్కసారికి నాకోసం రమ్మని ప్రాధేయపడ్డాను. ఊరికి వచ్చిన తర్వాత , ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఊరిలో ఎవరూ పనికి పోలేదు. అందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. నేను కొన్ని రోజులు ఉందామని చెప్పాను. అందుకు కు నా భార్య, కూతురు ఇద్దరు ఊరిలో ఉండడానికి ఒప్పుకోలేదు వెళ్ళిపోదామని చెప్పారు. ఇంతలో మా ఊరిలో ఉన్న లాయరు భీమరాజు గారు వచ్చి  సాహితీ , ఆమని అంటే మీరేనా అని అడిగారు. అవునని నా భార్య కూతురు ఇద్దరు సమాధానం చెప్పారు. లాయర్ గారు వచ్చి  దస్తావేజులు ఇక్కడ సంతకాలు పెట్టండని చెప్పారు. ఎందుకని అడిగేలోపే మీ అత్త అన్నపూర్ణమ్మ గారు సాహితీ అనే పేరు మీద పది ఎకరాలు పొలం, ఆమని పేరు మీద పది ఎకరాల పొలం రాసి ఇచ్చారని లాయర్ గారు చెప్పారు. కొడుకు పేరు మీద రాయకుండా మాకు ఎందుకు ఇచ్చారని వారు అడగ్గా ! అందుకు లాయర్ గారు నా కొడుకు ఎలాగైనా బ్రతుకగలడు. మా అబ్బాయి లేకపోతే మీరు బ్రతకలేరు అని కాదు. మీకు ఏదో ఒక సమయంలో ఆధారం అవుతుందని ఉద్దేశంతోనే మీకు రాస్తున్నానని అన్నపూర్ణ గారు నాతో చెప్పారని లాయర్ గారు బదులిచ్చారు. అప్పుడు నా భార్య సాహితి, కూతురు ఆమని బోరున విలపించారు. వాళ్లు చేసిన తప్పులకు క్షమించమని నా కాళ్లు పట్టుకుని ఏడ్చారు. నా పేరు సాహిత్య ప్రకాష్

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534



Thursday, January 17, 2019

కనుమరుగవుతున్న తెలుగు వారి కళలు, సంప్రదాయాలు మరియు పండుగలు

కనుమరుగవుతున్న తెలుగు వారి కళలు, సంప్రదాయాలు మరియు పండుగలు - Telugu Kalalu




ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు తమ జీవనవిధానంలో వినోదానికెప్పుడూ పెద్ద పీటనే వేసారు. కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి.



అలాంటి కళలు కొన్ని:



1. ముగ్గులు



ముగ్గులు వేస్తున్న తెలుగింటి అమ్మాయి - Muggulu 

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.



వేపపువ్వు, చెరుకుముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంతో శ్రద్ధతో తయారు చేస్తారు. వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి, చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పనినీ తలపెట్టకూడదని ప్రజల నమ్మకం.



2. కొమ్మునృత్యం



కొమ్మునృత్యం చేస్తున్న గిరిజన మహిళలు - Girijana Mahilalu 

కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం.









దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి ఈ నృత్యం కొమ్ము నృత్యం గా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యం "డోలు కొయ్య". చైత్రమాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు. ఆ పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరిపాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సందర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యం, ఈ కొమ్ము నృత్యం.



3. జముకు

పూర్వపు రోజులలో శక్తి గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు గ్రోలి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది.



4. బొమ్మలకొలువు



బొమ్మలకొలువు, Bommalakoluvuu 

ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి, మరి కొన్నిచోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప, దీప, నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి.

బొమ్మల కొలువులు చిన్న పిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఇల్లాండ్రను పిలిచి రాజూ-రాణీ, లేదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలకు పెళ్ళి చేయడమో లేదా పేరంటం చేయడమో చేసి వచ్చిన ఇల్లాళ్ళకు వాయినమిచ్చి పంపించడం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో.



5. ప్రభలు



 రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను ప్రభలు - Prabhalu 

ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు. అది రానురానూ అంతటా వ్యాపించింది. మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రభకు బహుమతిని అందచేస్తున్నారు.



గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్ప కొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రికి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథలు మొదలైనవి ఉంటాయి. తల నీలాల మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటేశ్వరుడు, త్రికోటేశ్వరస్వామి అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.



6. బుట్టబొమ్మలు

బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరునాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉంటాయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. బుట్టబొమ్మలు ఎత్తుగా ఉండి నడుము భాగమునుండి క్రిందికి దిగేకొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు.



బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. బుట్ట బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు కలవు



7. బుర్ర కథ





ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం -ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీరగాథలను గానం చేసేందుకు ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది. బుర్రకథ అనగానే నాజర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం బహుళ ప్రచారం పొందినవి.



బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. ముగ్గురు బృందముగా ఉండే ఈ ప్రదర్శనలో మధ్య పాత్రధారి ముఖ్య కధకుడు గానూ, మిగిలిని ఇద్దరిలో ఒకరు వంత కథకు, మరొకరు హాస్య కథకులుగానూ ఉంటారు. సాధారణంగా ఇది నిలుచుని చెప్పే కధ ఐనా, సౌలభ్యత కోసం కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయగలవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాలు ఉన్నాయి.



8. తండాలనృత్యం



లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా లంబాడీ మహిళల రంగురంగుల దుస్తులు, రకరకాల ఆభరణాలు చూడముచ్చటగా ఉంటాయి.



వీరు తండాలుగా జీవిస్తారు. పెళ్ళిళ్ళలో, జాతరలలో, వీరి సాంప్రదాయక సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది. అరకు అడవులలోనూ, శ్రీశైలం అడవులలోనూ మరియు భద్రాచలం అడవీ గ్రామాలలోనూ సందర్శకులకు కూడా వీరి నృత్యాలను చూసే అవకాశం ఉంది.



9. యక్షగానం



యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పు చెందుతూ వచ్చింది. మొదట యాత్రా స్థలాలు, కామందుల లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కధిస్థానములైనవి. వర్తమానంలో అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, ఏ కోవెల వాకిటనో, ఏ సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపి జల్లిన కటికనేలయే దాని రంగస్థలము.



పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము, రసోచితము, ప్రాంతీయోచితమైన వేషభాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగ, మేళ, తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి.



10. తప్పెటగుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు. వీరు ఎదురురొమ్ముపై తప్పెట గుళ్ళను కాళ్ళకు చేతులకు చిరు మువ్వలను దరించి అందరూ ఒకే పద్దతిలో కదులుతూ గానం చేస్తుంటారు.



11. జంగందేవరలు

తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగందేవరల ఆహార్యంగా ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.



12. ఎడ్లపందాలు



తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం.



13. కోడి పందాలు



గ్రామీణ ప్రాంతములో కోడిపందాలు

ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతి కి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే. ఒకప్పుడు గ్రామాలలో కోడి పందాలు అంటే కేవలం కోడిపందాలు మాత్రమే కాదు - పందాలు జరిగే ప్రాంతములో గుండాటలు, పేక మేజిక్ ప్రదర్శనలు, బొమ్మల దుకాణాలు, మిఠాయి దుకాణాలు ఇలా వివిధములతో దాదాపు తిరునాళ్ళ వాతావరణము ప్రతిబింబిస్తూ ఉండేవి. అందుచేతే పందాలంటే ఉదయంనుంచే హడావిడి మొదలయ్యేది గ్రామాలలో. పేరుకు నిషేధం విధించినా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.



14. పులివేషం

సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులివేషం కడతారు. డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన పైడి గురువులు సిద్ధహస్తులు.



విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని ఉంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ.



15. హరిదాసులు

సంకీర్తన చేయుచూన్న హరిదాసు

ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి "ఏ తీరుగ నను దయ చూచెదవో.." అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. చక్కని ఎర్ర రంగు పంచె కట్టుకొని, ఛాతీ మీద, భుజాలపై, నుదిటి మీద విష్ణు నామాలను పెట్టుకొని అపర నారదుల వలె అగుపించే హరిదాసులు, వారి కీర్తనలు సంక్రాంతి సమయంలో పల్లెకు కొత్త శోభను తెస్తాయి.



16. గోరింటాకు

కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభ ముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే.



17. గుసాడీ

ఆదిలాబాదు జిల్లాలో రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. నెమలి పింఛాలతో తయారు చేసిన పాగా, కృత్రిమమైన గడ్డాలు, మీసాలతో వేషం కట్టి, మెడలో గవ్వల హారాలు, తుంగకాయల దండలు, నడుముకు, మణికట్టుకు చిరు గంటలు, గజ్జెలు ధరించి, కంటి చుట్టూ తెల్లని రంగు పూసుకుని, చేతిలో కర్ర పట్టుకుని గుసాడీ నాట్యం చేస్తారు.



18. థింసా

థింసా నృత్యం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలో విశేషాదరణ పొందిన జానపద సామూహిక నృత్యాలలో ఒకటి. ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఆడా, మగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని కొండ జాతులవారు ఈ జానపద నాట్య సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ నాట్యాన్ని ప్రతి పండుగ సందర్భంలోనూ, వివాహాది సందర్భాలలోనూ చేస్తుంటారు. వీరి దైనందిన జీవితానికి, ఆచార వ్యవహారాలకు ఈ నాట్యం అద్దం పడుతుంది.



19. డప్పు

పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ముందు మెల్లగా ప్రారంభమయ్యే ఈ నృత్యం రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.



20. శరభనృత్యం

వంటినిడా విభూతి పుండ్రాలు ధరించి శరభ శరభా, హశ్శరభ శరభా అని వీరంగం వేస్తూ, చిందులు తొక్కుతూ, పొడవాటి పలుపు తాడుతో వీపులపై తాటించుకుంటూ ఖడ్గాలను చేత ధరించి వాటిని తిప్పుతూ నృత్యం చేస్తారు. మరొక పద్ధతిలో శూలాలతోనూ శూలాల చివర నూనె గుడ్డలు చుట్టి దానికి మంటలు పెట్టి వాటిని త్రిప్పుతూ నృత్యం చేస్తారు. ఇది కూడా పల్లెలలో ప్రసిద్దమైన జానపద కళ. ఇప్పటికీ ఈ నృత్యాన్ని చాలా చోట్ల వీరభధ్రస్వామి దేవాలయాలలో మరియు నిప్పుల గుండం తొక్కే సందర్బాలలోనూ చూడవచ్చు.



21. చెమ్మచెక్క

చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని, అని ఉంటాడు.



22. రుంజ

రుంజ అనే ఈ చర్మ వాద్యం అతి ప్రాచీనమైనది. శైవ సంప్రదాయానికి చెందినది. ఇప్పుడు కోస్తా జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న ఈ రుంజ వాద్యాన్ని విశ్వబ్రాహ్మణులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించవచ్చునట.

సంక్రాంతి సంభరాల్లో గంగిరెద్దులు



23. గంగిరెద్దులు

ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి.



24. చెడుగుడు

పల్లెల్లో చెడుగుడు

ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట. రెండు జట్లుగా జరిగే ఈ ఆటలో పది నుండి ఐదు వరకూ ఒకోజట్టులో సభ్యులుంటారు. కూత అనే ప్రక్రియతో అవతలి జట్టుమీదకు రెండవ జట్టు నుండి ఒకరు వెళతారు. అతడు నోటితో చేసే ఆకూత అనే శబ్ధం ఆపేలోపుగా అవతలి జట్టులో ఎవరినైనా ముట్టాలి. అవతలి జట్టు అతని కూత ఆపి పారిపోయేలోగా పట్టూకొంటే అతను బయట నిలుచోవలసి వస్తుంది.



25. బుడిగే జంగాలు

బుర్రకధలకు పూర్వ రూపమే జంగం కధ. ఈ కధను చెప్పే వారినే జంగాలని బుడిగే జంగాలని అంటారు. ఒకప్పుడు దేశభక్తి మత ప్రచారాలకు ఎంతో తోడ్పడినా ప్రస్తుతం తెరమరుగై కొందరి ఉధర పోషణార్ధం కొరకే పనికొస్తున్నాయి.



26. కనక తప్పెట్లు

డప్పుల వాయిధ్యాన్నే రాయలసీమలో కనక తప్పెట్లు అంటారు. వీటిని సాధారణంగా జాతరలకు, వివాహాలకు, చాటింపులకు ఉపయోగిస్తూ ఉంటారు. దప్పులతో గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ వివిద వరుసలలో లయగా వాయిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తారు



27. ఘటనృత్యం

ఘటనృత్యం లేదా గరగనృత్యంగా పిలిచే ఈ ప్రక్రియలో తలపై కలిశాకారం కలిగిన ఘటాన్ని ఎత్తుకొని డప్పులశబ్ధానికి లయగా నృత్యం చేస్తారు. ఐదు లేదా మూడు సర్పాల ఘటాలతో జాతరలలో ఎక్కువగా వెరు నృత్యం చేస్తుంటారు.



28. పగటి వేషాలు





జానపదుడి వీధి ప్రదర్శన-పగటివేషాలు జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుకవృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది.



అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాలపేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనాసమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు. పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. యక్షగానం, వీధినాటకాలనుండి బ్రోకెన్ డౌన్ మిత్ అన్న వాదం ప్రకారం వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారిపగటివేషాలని , స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారిపగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళొ నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ద వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి.







ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే ఈ విధవ మోహం చూడలేమని ఈ వేషంతో మా యింటి వద్దకు రావద్దని చెప్పడం మూలాన ఈ వేషం వేయడంలేదని వీరు వివరించారు. అట్లే కులాలకు , మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. ఈ వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా ఈ మేకప్ ఉండాలికాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ , పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం కాదు. పగటి వేషాలు చారిత్రకత జనవ్యవహారంలో ఉన్నకధలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకధ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కధలు ప్రస్తావనలోకొస్తాయి. పగటి వేషలను గురించి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రొ. ఎస్. గంగప్ప పరిశోధించి పగటి వేషాలు వాయసంలోను, కూచిపూడి భాగవథులు ప్రదర్శించే వేషాలను పగటి వేషాలుగా వివరించారు. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన ఈ కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ఠ రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమ్నుండే ఈ కలారూపం ఉందని, హాలుని గాధాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు.



పగటివేషాలు - వర్గీకరణ పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషల్లు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు.

ఇతివృత్తం ఆధారంగా పగటివేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. 

1. మతపరమైనవి: ఆదిబైరాగి వేషం, చాతాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సహెబుల వేషం.

2. కులపరమైనవి: బుడబుక్కల వేషం, సోమయాజులు-సోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయవాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి.

3. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి.

4. జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పములోల్ల వేషం,

5. ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాశికావిళ్ళ వేషం వంటివి.



పగటివేషాలు- ప్రదర్శన రీతులు పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరికొన్నింటిలో పద్యాలకు, అడుగులకు , వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుడకల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియ చేస్తూ ఆ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి. పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటిగడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు. పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటున్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది.



29. బతుకమ్మ



తెలంగాణా ప్రాంతంలో ఆచరించే పూల పండుగ, పూబోడుల పండుగ, బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో మహిళలు జరిపే ఈ పండుగ చివరి రోజును సద్దలు అని వ్యవహరిస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. రంగు రంగుల పూలను ఎంతో మెళుకువతో పిరమిడ్ ఆకారంలో పేర్చి, ఆ పువ్వుల కుచ్చెన నడిబొడ్డులోగాని, శిఖరంలోగాని గౌరమ్మను అమరుస్తారు. ఈ పువ్వుల పళ్లెరాన్ని వాకిట్లో ఉంచి కొత్త దుస్తులు ధరించి స్త్రీలు, బాలికలు చేరి దీని చుట్టూ క్రమంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత ఊరేగించి ఈ బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.



గొర్రెల మందలను కాయడం ఒక వర్గం ప్రజలకు వృత్తి. గొర్రెలు పాలు ఇస్తాయి, ఉన్ని ఇస్తాయి. పైగా వ్యవసాయ భూములలో మందలను వదలి పెట్టడం వల్ల ఆ భూములకు ఎరువులు సమకూరి సారం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కాపరులు గొర్రెలను తోలుకుపోవడం తెలుగునాట తరుచుగా కనబడే చక్కని దృశ్యాలలో ఒకటి.



30. వినాయక చవితి

హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి.



పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది.



కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం ఎంతో అందమైన దృశ్యం.









పల్లెల్లో కులవృత్తులు

గ్రామాల్లో - కులవృత్తులు వారి జీవన విధానం - Pallelu - Kulavruttulu, Kulam





 పల్లెల్లో కులవృత్తులు

కులం అనేది వారివారి వ్రుత్తి ధర్మానికి సంబందించినది. "తక్కువ కులం - పెద్ద కులం" అంటూ ఏమిలేదు, అది కొందరు అతి గర్వమున్నవాళ్ళు వారికి వారు విధించుకున్న ఒక నిబందన మాత్రమే. ప్రతి కులం వారికి సామాన గౌరవముంది. కులానికి, మతానికి ఎటువంటి సంబంధం లేదు. కులాల పేరుచెప్పి హైందవ ధర్మాన్ని విస్చిన్నం చేసి మతమార్పిడులకు పాల్పడుతున్నవారిని తరిమి-తరిమి తన్నాలి. కాబట్టి కులవృత్తులు ఎలా ఉంటాయి?

1.చాకలి:
ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి. చాకలి లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారిది ముక్యమైన పని అందరి బట్టలను వుతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తికుని వెళ్లి తింటారు. అలాగె రాత్రికి కూడ కొంత అన్నం పెట్టాలి. దీనికొరకు చాకలి స్త్రీ ఒక గంప, ఒక పాత్ర తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి అన్నం కూరలు తీసుకుంటుంది. అన్నాన్ని గుడ్డ పరచిన గంపలో వేసుకుంటే కూరలను ఒక పాత్రలో పోసుకుంటుంది. ఆ విధంగా వూరి వారి అందరి కూరలు ఒకే పాత్రలో సేకరించడము వలన అది ఒక ప్రత్యేక రుచిని కలిగి వుంటుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పుట్టినదే సామెత.. చాకలి కూర. వూరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగ గుర్తు పట్టగలరు. అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది.



పల్లెలోని ఏ కుటుంబంలోనైనా ఆడపిల్లలు సమర్తాడితే ఆ సందర్బంలో ఆ అమ్మాయి ఒంటి పైనున్న బట్టలు చాకలికి చెందుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సామెతె పుట్టింది. అదేమంటే సరదాకి సమర్థాడితే చాకలి చీర పట్టుక పోయిందట. సామెత వివరణ ఒక అమ్మాయి సరదాకి తాను సమర్థాడినట్లు ప్రకటించింది. ఆనవాయితి ప్రకారము చాకలి వచ్చి స్నానం చేయించి ఆ చీర పట్టుకొని పోయిందట. అదే విధంగా వివాహము వంటి శుభ కార్యాలలోను, చావు వంటి అశుభ కార్యాలలోను చాకలి, మంగలి వంటి వారు తప్పని సరిగా నిర్వహించ వలసిన కార్యాలు కొన్ని వుంటాయి. వాటినే చాకలి సాంగెం, అని మంగలి సాంగెం అని అంటారు. చావులో గాని, పెండ్లి లోగాని చాకలి వారి పని దీవిటి పట్టడము. అది పగలైనా, రాత్రి అయినా దీవిటి పట్టవలసినదే. ఆ విధానము ఒక తప్పనిసరి అయిన సాంప్రదాయము అయిపోయినది. వీరు దీవిటి పట్టడమనే తంతు దేవుని ఊరేగింపులోను, గంగమ్మ జాతర వంటి జాతర సందర్బంలోను తప్పని సరి. గంగమ్మ జాతరలో చాకలి వారే పూజారులు. ఈ విధానములో వీరికి కొంత సంభావన ముట్టుతుంది.



గ్రామంలో ‘రజకులు’ (చాకలి) కొన్ని కుటుంబాలకు ఒక కుటుంబం చొప్పున రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతూ ప్రతి దినం అన్నం పెట్టించుకొని వెళ్ళేవారు. పదవులు నిర్వహించే వారు, భాగ్యవంతులు చాకలికి ‘ఇస్త్రీ పెట్టె’(iron box) ఇచ్చి బట్టలు ‘చలువ’ చేయించుకొనే వారు. సంవత్సరానికి కుటుంబానికి నిర్ణయించిన ‘మేర’ ప్రకారం ధాన్యం వగైరా తీసుకనే వారు. చాకలి వాళ్ళే రైతుల సహాయంతో ‘బట్టీ’ల ద్వారా సున్నం తయారుచేసి కుటుంబానికి కావలసినంత ఇచ్చేవారు. తాంబూలం వేసుకొనే వారికి వీరు ప్రత్యేకమైన సున్నం ఇచ్చేవారు. పెళ్ళి మొదలైన శుభకార్యాలకూ, దైవకార్యాలకూ రజకులు పందిళ్ళు వేసి మామిడి తోరణాలు కట్టేవారు. వంట చెరకు విషయంలో కూడా వీరు రైతులకు ఎంతో సహకరించే వారు.



చాకలి వారు చేయ వలసిన పనులలో మరొకటి ఏమంటే చిన్నపిల్లలకు పురిటి స్నానము చేయించడము, ఆ సందర్బాని ఊరివారందని పిలవడము వీరి విధులల్లో ఒకటి. ఆ చాకలి ప్రతి ఇంటికి వెళ్లి పలాన వారింటిలో పురుడు పోస్తారు మీరు రావలసినదని చెప్తాడు. దీన్ని పురస్కరించుకొనొ ఒక సామెత పుట్టింది. అదేమంటే చాకలి దానికి చెప్పి చాలుకున్నడట. సామెత వివరణ: ఏదైనా ఒక రహస్యము చెప్పి ఎవరికి చెప్పవద్దంటే వాడు ఆ విషయాన్ని చాకలి వానికి చెప్పి చాలుకున్నాడట. అనగా చాకలి దానికి చెప్పిన విషయము వెంటనే ఆ పల్లెకంతా తెలిసి పోతుందని అర్థము.



కాలక్రమేణా వృత్తులు వ్యాపార దృష్టిని సంతరించుకొన్నాయి. సమాజం సమూలంగా మార్పు చెందింది. ఆధునిక పరికరాభివృద్ధి ఫలాలైన ‘లాండ్రీలు’, ‘బార్బర్‌ షాపులు’, నూలుమిల్లులు మొదలైన వాటి పోటీలో చేతివృత్తుల వారు వెనుకబడిపోయి బ్రతుకు దెరువుకోసం పట్టణాలకు వలసలు పోవలసిన దౌర్భాగ్యం పట్టింది. సకాల వర్షాలు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో చివరకు రైతుల ఆత్మహత్యలతో దేశ ఆహారోత్పత్తి కుంటుబడుతున్నది. వ్యాపార పంటలు, ఉన్నత విద్యపై మోజు పెరగడంతో నగరీకరణ జరుగుతూ పల్లెలు చాలావరకు నగరాల్లో కలిసిపోగా మిగిలినవి వెనుకబడిపోయాయి.



2. మంగలి:

మంగలి వృత్తి కూడ ఆ నాటి సమాజంలో చాల ప్రధానమైన వృత్తి. ప్రతి సారి ప్రతి ఫలం ఆశించ కుండా అందరికి క్షవరంచేసే వీ ఆ పనికి గాను ఫలితానికి, మేర ద్వారా ఐదు బళ్లల వడ్లు, ఒక మోపు వరి తీసుకునేవారు. తలంటు స్నానం చేయించడం వంటి పనులు చేసె వారు. ప్రతి రోజు మంగలి పల్లెలలోనికి వచ్చి క్షురక వృత్తి చేసె వారు. తల క్రాపు చేయడం, పెద్దవారికి గడ్డం చేయడం వంటివి చేసె వారు.



నాయా బ్రాహ్మణులు (మంగలి వాళ్ళు) గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఒకరు చొప్పున ఇంటింటికి వెళ్ళి ‘తలపని’ (క్షవరం) చేసేవారు. సంవత్సరాంతంలో వీరు తమ ‘మేర’ తీసుకొనే వారు. వివాహ కార్యాల్లో వీరు వధూవరుల చేతి, కాళ్ళ గోళ్ళు తీయటం మొదలైన ‘కన్నెపెళ్ళి’ పనులు చేసే వారు. పుట్టు వెండ్రుకలు తీయటం, శుభకార్యాల్లో మంగళ వాద్యాలు వాయించి తగిన పారితోషికం పొందటం వల్ల వీరి జీవనం సాగేది. వీరు దైవకార్యాల్లో నిలయ విద్వాంసులుగా ఉండటం వల్ల ‘దేవుని మాన్యం’ కూడా భుక్తంగా ఉండేది.



ఈ విధంగా ’Artisans’ అనీ, పంచభట వృత్తుల వారనీ వీరు గ్రామాల్లో కొన్ని ప్రత్యేక సంప్రదాయ విధానాలు కలిగి, పని హక్కు గలిగి, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే వారు. ప్రాచీన కాలం నుంచి వీరికిచ్చిన ‘మాన్యము’ వంశపారంపర్యంగా అనుభవిస్తూ కార్యసాధకులుగా ఉండేవారు.



3. కుమ్మరి:

అమ్మకానికి సిద్దంగా వున్న కుమ్మరి చేసిన కుండలు.

కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు. వీరికి కూడ ప్రతి పలితానికి 'మేర' వరి మోపు ఇచ్చేవారు. పెద్ద వస్తువులైన, కాగు, తొట్టి, ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకొని ఇచ్చేవారు. పెళ్లి సందర్భంగా ''అరివేణి'' కుండలని కుమ్మరి వారు ఇవ్వాలి. అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు.



వంటకు నాడు గ్రామాల్లో దాదాపు అందరూ మట్టి పాత్రలే వాడేవారు. కుమ్మరులు మట్టితో తయారుచేసిన చట్లు, కుండలు, మూకుళ్ళు, బానలు, కడవలు, ముంతలు, అన్నం తినే చిప్పలు బియ్యం, ధాన్యం పోసుకొనే పెద్ద ‘గరిసెలు’ ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చేవాళ్ళు. సంవత్సరాంతంలో తమకు వచ్చే ‘మేర’ రైతుల నుండి తీసుకొనే వారు. అదనంగా వీరు వివిధ రకాల మట్టిపాత్రలు తయారుచేసుకొని ‘కావిళ్ళ’తో మోసుకొనిపోయి సమీపంలోని పట్టణాల్లో వాటిని అమ్ముకొనే వారు. దైవకార్యాల్లో కుమ్మరులు తమకు కేటాయించిన పనులు నియమంగా నిర్వహించే వారు.



4. వడ్రంగి:

వీరి పని కర్రలతో పని ముట్లు తయారు చేయడం. నాగలి, కాడిమాను, ఎద్దుల బండి, ఇంటి సామానులు తయారు చేయడం వీరి పని. వ్యవసాయం యాంత్రీకరణమైన ఈ రోజుల్లో వడ్రంగి చేయవలసిన వ్వయసాయ పని ముట్లు ఏమి లేవు. అయినా ఇంటికి సంబందిచిన ద్వారాలు, కిటికీలు వంటి పనులు వీరికి ఎక్కువగా వున్నాయి వారు ఇప్పటికి పూర్తి స్థాయిలో పనులలో నిమగ్నమై వున్నారు. వారికి కావలసినంత డిమాండు వున్నది.



5. మేదర:



మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు మరియు ఇతర అందమైన అలంకార వస్తువులు.

వీరు వెదురు బద్దలతో తట్టలు,, బుట్టలు చాటలు దాన్యాన్ని నిలవ చేసె బొట్టలు ఎద్దుల బండికి వేసె మక్కిన వంటివి అల్లు తారు. గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెఛ్ఛి తట్టలు బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగ వుండేది. తాము తయారు చేసిన వస్తువులను రైతులకు దాన్యాన్నికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.



6. జంగం వాళ్ళు:

జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిది, వార, నక్షత్రాలను చెప్పి తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుబాలను చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగానే వుంటుంది. కాషాయ వస్త్రాలను ధరించి, తలపాగా కట్టి, బుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతొలో శంఖం వుంటుంది.



7. కంసాలి:

లోహ వస్తువులను తయారు చేసె వారిని కంసారి అంటారు వీరు కత్తులు, గొడ్డల్లు, కొడవళ్లు వంటి లోహ సామానులు చేసె వారు. ఇప్పుడు వాటి అవసరం ఎక్కువ లేదు. అయినా యంత్రాలతో తయారైన రడిమేడ్ పరికరాలు సంతల్లో దొరుకుతున్నాయి. గతంలో అక్కడక్కడా ''కొలిమి'' వుండేది. కాని ఈరోజుల్లో కొలిమి ఎక్కడా లేదు.



8. గాజుల వాళ్ళు:

ఆ రోజుల్లో గాజుల శెట్టి తన మలారం బుజాన వేసుకొని పపల్లెల్లో తిరిగే వారు. మలారం అంటే: సన్నని పొడవైన దారాలకు గాజులను రెండు వైపులా గుత్తులు గుత్తులుగా కట్టి ఆ దారాలన్నింటిని మధ్యలో ఒకటిగా కట్టి దాన్ని బుజాన వేసుకుంటారు. గాజుల వాళ్ళు కొన్ని పల్లెలను తమ ప్రాంతగా విభజించుకొని ఆ యాపల్లెలలో వారె గాజులను అమ్మేవారు.



9. మాల:

వీరు హరి జనులు. ఇతర ప్రాంతాలలో వీరిని అంట రాని వారుగా పరిగణించబడినా, ఈ ప్రాంతంలో అనగా రాయలసీమ లో మాత్రం అంట రాని తనం అంత తీవ్రం వుండేది కాదు. వీరి జన సంఖ్య ఎక్కువే. వీరు ఎక్కువగా కూలీలుగా వుండే వారు. వీరిలో కూడ భూములున్న వారు కొందరుండేవారు. వీరు వ్వవ సాయ పనులు చాల బాగ చేస్తారు.



10. మాదిగ:

వీరు కూడ హరిజనులే. కాని వీరి జన సంఖ్య తక్కువే. వీరు చెప్పులు కుట్టడం, తోలు తోచేసిన కపిలి బానలను కుట్టడం అవకాశం వున్నప్పుడు రైతు పొలంలో కూలికి వెళ్లడం చేసే వారు. వీరికి కూడ రైతుల నుండి మేర వరి మోపు లభిస్తుంది. రైతు లందరూ వీరి వద్దనే చెప్పులు కుట్టించు కునేవారు. కరెంటు మోటార్లు వచ్చాక వీరి వృత్తి మరుగున పడిపోయింది.



11. బెస్త వారు:

బెస్త వారి కులంలో అనేక ఉప కులాలున్నాయి. గంగ పుత్ర, వన్నెకుల క్షత్రియ, పలికాపు, అనే కులాలు ఇందులోనె ఉన్నాయి. బెస్త వారి వృత్తి చేపలు పట్టడము. ఈ కులం వారు కృష్ణా, గోదావరి, తుంగ భద్రా నదీ ప్రాంతాలు, మరియు సముద్ధ తీర ప్రాంతాలలోనె ఎక్కువ ఉన్నారు. మిగతా ప్రాంతాలలో వీరి జన సంఖ్య చాల తక్కువ. వీరు చేపలు పట్టడం తప్ప మరే పని చేయలేరు. తీర ప్రాంతాలలో వుండే బెస్తలకు దిన దిన గండం నూరేళ్ల వయస్సుగా బ్రతుకీడుస్తున్నారు. వారి వృత్తి ప్రాణాలతో తెలగాటమే. వీరు ఆర్థికంగా చాల వెనుక బడిన కులంవారు. చేపలు పట్టే పడవలు, బోట్లు లక్షలాది రూపాయల విలువ చేస్తాయి. వాటిని వీరు కొనలేరు. పెద్ద ఆసాములు పడవలను కొని బెస్త వారికి అద్దెకిస్తుంటారు. వీరి అద్దె విధానము వైవిధ్యంగా వుంటుంది. పడవకు రోజుకింత అని గాని, లేదా నెలకింత అనిగాని అద్దె వుండదు. ఒక సారికి ఇన్ని చేపలు ఇవ్వాలి అని నిబందన వుంటుంది. అదే ఆ పడవకు అద్దె. వారికి ఎన్ని చేపలు దొరికినా అద్దె చేపలు పోగా మిగిలిన చేపలు బెస్త వారికి చెందు తాయి. చాల సార్లు అద్దెకు ఇవ్వాల్సిన చేపలు కూడా దొరకవు. ఇలా ఎక్కువ సార్లు వారికి తగిన ఫలితము దొరకదు. కొందరు చిన్న చిన్న పడవలలో చేపల వేటకు వెళ్లతారు. అవి చాల దూరం ప్రయాణించలేవు. కనుక అధికంగా చేపలు దొరకవు అంత దూరం పెద్ద పడవలే వెళ్లగలవు. అదృష్త వశాత్తు ఎప్పుడైనా పెద్ద చేపలు ఎక్కువగా దొరికితే బెస్త వారి పంట పండినట్టు కాదు. మధ్యలో దళారులుంటరు. చేపలను వారికి అమ్మాల్సిందే. పట్టిన చేపలను దాచుకొని నిదానంగా అమ్ముకుందామంటే కుదరదు. ఏ రోజుకారోజు వాటిని అమ్మేయాల్సిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు ఎంతో కొంత ధనం ముట్ట జెప్పి ఆ చేపలను తమ స్వంతం చేసుకొని తగు రీతులో వాటిని ఎగుమతి చేసి అధిక మొత్తంలో ధన సంపాదన చేస్తున్నారు. బడుగు జీవులైన ఈ బెస్త వారు తమ వృత్తిని వదులుకోలేక వేరె పని చేయలేక అలాగె బ్రతుకీడుస్తున్నారు.



జూలై, ఆగస్టు నెలల్లో చెరువుల్లో చేప పిల్లన్ని వదిలి మార్చి నుంచి మే వరకు చేపలను పడతారు. దళారీలు చెరువులను గుత్తకు మాట్లాడుకొని ఆదాయాన్ని గడించటంవల్ల మత్స్యకారులు నష్టపోతున్నారు. చెరువులో విత్తనాలు చల్లే సదరు కాంట్రాక్టర్‌ చేపలు పట్టే సమయానికి మత్స్యకారుల వద్ద కొనుగోలు చేస్తాడు. వాటిని ఆ వ్యక్తి మార్కెట్‌లో ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. దళారి వ్యవస్థ లేనిపక్షంలో మత్స్యకారులు నేరుగా చేపలను మార్కెట్‌కు తరలించి విక్రయించి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సొసైటీలకు విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఫలితంగా వృత్తిదారులు స్వయంగా విత్తనాలు వేసి చేపలు పట్టుకొని మార్కెట్‌కు తరలించి విక్రయించడం ద్వారా లాభాన్ని గడించే అవకాశం లభించింది. వాగులలో ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసింది. 105 రూపాయల ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు చేపలు పట్టుకొనే వీలు కల్పించింది. కట్ల, రౌ, బంగారు తీగ చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. చేపల మార్కెటింగ్‌కు గాను ఈ మధ్య మహిళలకు సబ్సిడీపై బైక్‌లను అందించారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో చిత్తూరు, పశ్చిమ గోదావరి మెదక్‌ జిల్లా ల్లోగురుకుల పాఠశాలలున్నాయి.వృత్తిదారులు చనిపోతే రెండు లక్షలు భీమా ఇస్తున్నారు. మహిళా మత్స్యకారులు కూడా మత్స్య మిత్ర గ్రూపుల నుంచి రుణాలు, నైలాన్‌ వలలు, ఐస్‌ బాక్స్ లు తదితర పరికరాల కోసం రుణాలు పొందారు.మహిళా మత్స్య ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి వారికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు. తక్కువ నీటిలో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేసే మెళకువలు నేర్పించాలని, కేరళలో చేపడుతున్నట్లుగా ఇక్కడ కూడా చేపల పచ్చళ్లు, ఫ్రై తదితర వెరైటీ వంటకాలు తయారు చేసి విక్రయించేలా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరికైనా చేపలు అవసరమైతే డోర్‌ డెలివరీ చేసే స్థాయికి ఎదగాలని వృత్తి దారులు భావిస్తున్నారు.



12. సాలె వారు:

సాలె వరి వృత్తి మగ్గం పై బట్టలు నేయడము. వీరి పరిస్థితి కూడా చాల అద్వాన్నంగా ఉంది. (వివరాలు సేకరించ వలసి వున్నది)



13. దొమ్మరి:

దొమ్మరి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలలో కనిపించే ఒక సంచార జాతి. వీరిలో కొందరు వీధిలో సర్కస్ ప్రదర్శనలు ఇచ్చి సంపాదించేవారు. ఒకనాడు పడుపు వృత్తే వీరి జీవనాధారం. వారికి సంబదించిన సామెత. " చెప్పేది సారంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు" వెళ్ళటం లేదు. కనిగిరి పట్టణ శివారు ప్రాంతంలో దాదాపు వంద కుటుంబాల దొమ్మరులు నివసిస్తున్నారు. ఆడవారు ఇళ్ళల్లో పాచి పనులు, మగవారు చెక్క దువ్వెనలు, ఈరిబానులు అమ్ముకోవడం, గేదెల కొమ్ములు కోయడం, పండ్ల బండ్లు వేసుకొని కాయలు అమ్ముకుంటున్నారు. అడవి ప్రాంతంలో తెచ్చుకున్న కరల్రతో చెక్క దువ్వెనలు, ఈరిబానులు తయారు చేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. దువ్వెనల తయారీ పందుల పెంపకం వీరి కుటీర పరిశ్రమలు.వారు ఒళ్లు గగుర్పొడిచే విద్యలు ప్రదర్శిస్తారు. సన్నటి తాడుపై నడచి అబ్బు రపరుస్తారు. బిందె మీద బిందెలు పెట్టి వాటిపైన సాహసాలు చేస్తారు. గడ ఎక్కి ఊరికి శుభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈనాటి జిమ్నాజియానికి తీసిపోని విన్యాసాలు చేస్తారు దొమ్మరులు. దారిన వెళ్లేవారు కూడా కాసేపు నిలబడి వీరి ప్రదర్శన చూసి సంతోషంగా తమకు తోచినంత ఇచ్చి వెళ్లేవారు. దొమ్మర కులస్థులు నిత్యసంచారులు. చివరికి వారుండే గుడిసెలను కూడా గాడిదలపై వేనుకుని ఊరూరా తిరుగుతారు. వీరు ఇంట్లో వస్తువులతో పాటు మేకలు, కుక్కలను కూడా తమ వెంట తీసుకెళ్లి ముందుగా ఊరి చివర దిగుతారు. తర్వాత ఊరి పెద్ద వద్దకు పోయి ఆ గ్రామంలో ప్రదర్శన ఇస్తామని చెబుతారు. దొమ్మరులు గ్రామంలో అడుగుపెడితే శుభసూచకమనే భావన ఉండేది. ఎవ్వరూ అడ్డు చెప్పేవారు కాదు. పదేళ్లువచ్చేసరికి వీరు తమ పిల్లలకు శిక్షణ ఇస్తారు. గడ ఎక్కడం, దూకటం, పల్టీలు కొట్టటం, బిందెల మీద బిందెలు పెట్టి దానిమీద మనిషిని నిల బెట్టటం వంటివి సాధన చేయిస్తారు. విన్యాసాలు ప్రదర్శించే ఒక బృందం తయారు కావాలంటే కనీసం ఎనిమిది మంది ఉండాలి. వీరంతా గ్రామ కూడలిలోనో, చావిడి దగ్గరో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దొమ్మరులు గ్రామానికి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం కనుక వర్షాలు కురవకపోయినా, పం టలు పండక పోయినా దొమ్మరవాళ్లను ఆ గ్రామా నికి ప్రత్యేకంగా పిలిపించుకుంటారు. దొమ్మర ఆడపడుచుతో వ్యవసాయ భూముల్లో ప్రదర్శన ఏర్పాటు చేయిస్తారు. వేపాకు, పసుపు, బియ్యం కలిపిన మూటను నడుముకు కట్టుకున్న దొమ్మర మహిళ గడ ఎక్కుతుంది. దాదాపు 40 అడుగుల ఎత్తున్న ఈ గడపై ఆమె విన్యాసాలు చేస్తూ వడిలో ఉన్న బియ్యాన్ని వ్యవసాయ భూములపై విసురుతుంది. బావుల దగ్గర కూడా ఆమె ఓడు బియ్యాన్ని చల్లుతుంది. ఈ తంతు ముగిశాక వర్షాలు కురిసి గ్రామం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. విన్యాసాలు చేసే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడితే వెంట తెచ్చుకున్న చెట్ల పసర్లతో వైద్యం చేసుకునేవారు.



14. ఇతర ఆశ్రిత జాతులు:

పల్లె వాసుల పై ఆధారపడిన యాచక వృత్తి వారు అనేకం. అందులో ముఖ్యమైనది బుడబుక్కల వారు. వీరి వేష ధారణ చాల గంబీరంగా వుంటుంది. నొసటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని కోటు వేసుకొని, మెడపై అటు ఇటు కింది వరకు వేలాడుతున్న చీరలను ధరించి, కుడి చేతిలో చిన్న డమరుక / బుడబుక్కను ధరించి 'డబ డబ' వాయిస్తూ అంబ పలుకు జగదంబా పలుకు కంచి లోని కామాక్షి పలుకు, కాసీలోని విశాలాక్షి పలుకు అంటూ ఆయా గృహసుని కష్టాలను ఏకరువు పెడ్తాడు. ఇదిగో అంబ పలుకుతున్నది అంటూ తన బుడబుక్కను వాయిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఎవేవో మాయ మాటలు చెప్పి వాటిని 'అంబ' పలుకుతున్నదని నమ్మిస్తాడు. వాటి నివారణకు మంత్ర తంత్రాలను కడతానంటాడు. వాడి మాటలకు లొంగి పోయిన పల్లెవాసులకు కొన్ని కష్ట నివారణ మార్గాలను చూసిస్తూ యంత్రాలను, తంత్రాలను ఇచ్చి ఇంటిలో వెన్ను గోడులో గాని, గడప పై గాని కట్టమని ఇస్తాడు. ప్రతి ఫలంగా కొంత దాన్యాన్ని పొందు తారు. వీరి ప్రస్తావన ఈ కాలంలో చాల అరుదుగా ఉంది. ఇంకా పూర్తిగా మాసి పోలేదు .



15. కొండ రాజులు:

కుర్రు తొకన్నలు. వీరు కూడా గంబీరమైన ఆహార్యముతో వుంటారు. భుజాన జోలితో, ఎర్రటి వస్త్రాలు ధరించి, నెత్తిన తలపాగతొ, అందులో నెమలి పించం పెట్టి రాజసం ఉట్టిపడేలా వస్తారు. కుర్రో కుర్రు.... కొండ దేవరా పలుకు, ..... అంటూ పల్లె వాసులకు కల్ల బొల్లి కబుర్లు చెప్పి వారిని తమ మాయ మాటలతో వశీకరణ చేసుకొని, వారి కష్టాలకు నివారణోపాయాలు చెప్పి కొంత ధాన్యం ప్రతి ఫలంగా పొందు తారు.



16. మొండోళ్లు:

వారు ఏరైతు ఇంటి ముందు వాలినా వారు బిచ్చం వేసినంత వరకు వెళ్లరు. అందుకె వాళ్లను మొండోళ్లు అని అన్నారు. వారి నుండి పుట్టినదె ఈ సామెత మొండోడు రాజు కన్న భలవంతుడు. వారు రైతు ఇంటి ముందు భయాన దృశ్యాలను ప్రదర్సిస్తాడు. రక్త సిక్తమైన పసి పిల్లవాన్ని చేటలో పెట్టి దాన్ని ఇంటి ముందు పెట్టి పెద్ద కొరడాతో తనను తాను కొట్టు కుంటూ నానా భీబచ్చం చేస్తారు. అతని భార్య తన మెడకు వేలాడు తున్న ఒక వాయిద్యంతో వింత వింత శబ్ధాలు చేస్తూ పాటలు పాడుతుంది. ఈ ఘోర కృత్యాలను భరించ లేక గృహస్తు రాలు ఎంతో కొంత వడ్లు గాని బియ్యం గాని బిచ్చం వేస్తుంది. వారు అక్కడి నుండి ప్రక్క ఇంటి కెళుతారు.



వాయిద్య సహకారంతో పాటలు పాడి యాచించె రైతుల పైన, వారి పొలాల పైన ఆధార పడి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బ్రతికే అనేక ఆశ్రిత జాతుల వారి ఆరోజుల్లో చాల సంతోషంగానె కాలం గడెపేవారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇటు రైతులు అటు రైతులపై ఆధార పడి బ్రతికే ఆశ్రిత జాతులు రైతులకు పరాయి వారుగానె మిగిలిపోయారు. స్వంత ప్రాంతంలో వున్న దళితులకు రైతులకు ఆనాడు వున్న అవినాబావ సంబంధం ఇప్పుడు ఎంత మాత్రము లేదు. ఇది సాంఘిక పురోగమనమో, తిరో గమనమో.



17. చిలక జోస్యం:

చిలక ఒక కార్డు తీస్తున్నది.

వీరు ఒక పంజరంలో చిలకను పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ జోస్యం చెపు తుంటారు. వీరు మంచి మాట కారులు. వీరిని ఎవరైన తమ ఇంటికి పిలిస్తే వెళ్లి కూర్చొని చిలక పంజరాన్ని కింద పెట్టి సుమారు ఒక ఇరవై కవర్లను వరుసగా పేర్చి పెట్టటాడు. ప్రతి కార్డులో ఒక దేవతా బొమ్మ మరొక కార్డుపై జ్యోతిషానికి సంబంధించిన కొన్ని మాటలు వ్రాసి వుంటాయి. జ్యోస్యం చెప్పించు కో దలచిన వాని పేరు అడిగి పేరును బట్టి అతన నామ నక్షత్రము చెప్పి దానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పుతాడు. ఆ తర్వాత పంజరం తలుపు తీసి చిలకను బయటకు పిలుస్తాడు. ఆ చిలక వచ్చి కొంచెం అటు ఇటు తిరిగి అక్కడ పరిచిన ఇరవై కవర్లలోనుండి ఒక కవరును తన ముక్కుతో తీసి బయట పడేస్తుంది. దానిని జ్యోతిష్కుడు తీసి అందులోని దేవతా బొమ్మని చూపి జరిగినవి, జరగబోయే విసేషాలను ఏకరువు పెడతాడు. తర్వాత మరొ కార్డులోనివిషయాన్ని చదివి కొన్ని లెక్కలు వేసుకొని సమస్యకు కొన్ని పరిష్కారా మార్గాలను సూచిస్తాడు.



18. యాచక వృత్తి వారు:

చాల కాలం క్రితం జాన పద కళారీతులకు బాగా ఆదరణ వున్న రోజుల్లో ఆయా కళాకారుకలు ప్రజల్లో మంచి గౌరం వుండేది. అటు వంటి వారిని పల్లె ప్రజలు పిలిపించుకొని వారి కళా రూపాన్ని ప్రదర్శింప చేసుకొని ఆనందించి వారికి కొంత సంభావన ఇచ్చే వారు. ఆవిధంగా వారి జీవనం గౌరప ప్రదంగా సాగేది. అలాటి వాటిలో ముఖ్యం చెప్పుకో దగ్గది.... బుర్ర కథ, ఒగ్గు కథ మొదలైనవి. కాల క్రమంలో వీరి కళకు ఆదరణ తగ్గి అంతరించి పోయే దశలో మిగిలిన ఆ కళాకారులు లేదా వారి వంశం వారు బ్రతుకు తెరువుకు వేరు మార్గము చేత గాక..... తమ వృత్తికి ఆధణ లేక, వారే తమ కళను పల్లెల్లో ఇళ్లముందు ప్రదర్శించి యాచించి తమ జీవనమును జరుపుకుంటున్నారు. బుర్ర కథలోని మాధుర్యాన్ని రుచి యేరిగిన పల్లె పద్దలు.... ఆ కళాకారుల చేత మరికొంత సేపు బుర్ర కథను చెప్పించుకొని ఎక్కువ సంభావన ఇస్తున్నారు. ఆ తరం మారితే వారికి అంత మాత్రము కూడా ఆదరణ కూడా దొరకదనిపిస్తుం.



కొన్ని జాతుల వారు కేవలము యాచనే వృత్తిగా స్వీకరించి అదే ఆధారంగా జీవించె వారున్నారు. ఇలాంటి వారిలో ఆ కుటుంబంలో అందరు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇటువంటి వారిలో కొందరు స్త్రీలు రామారి పాటలు పాడి యాచిస్తుంటారు. వారు ఎటువంటి ఆగడాలు చేయరు. గృహస్తు రాలు వారికి ఎంతో కొంత బిచ్చం వేసి పంపు తుంది. ఇంకొంత మంది వుంటారు..... వారు.. దొమ్మరి వారు వీధిలో గారిడి విద్యలు ప్రదర్శించి ఇంటింకి వెళ్లి యాచిస్తుంటారు. ఈ దొమ్మరి వారు, సంచార జాతులు. వీరు పల్లెలకు దూరంగా డేరాలు వేసుకొని తాత్కాలికంగా నివాసం వుంటారు. వీరు రెండు కర్రల మధ్య ఒక దారం కట్టి చిన్న పిల్లల చేత దాని మీద నడిపించడం, వారి చేతనే వింతైన కుప్పి గంతులు వేయించడం, ఇలా కొన్ని ప్రదర్శనలిచ్చి ఇటింటికి వెళ్లి యాచించడం వారి ప్రధాన వృత్తి. వీరి ఉప వృత్తి ''వ్వబిచారం'' వీరి నుండి పుట్టినదే ఈ సామెత '' చెప్పేవి సారంగ నీతులు.,.. దూరేది దొమ్మరి గుడిసెలు''. ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గినా పూర్తిగా మాసి పోలేదు. ప్రస్తుతం వీరి సంఖ్య పల్లెల్లో కన్నా జన సంఖ్య ఎక్కువగా వున్న వారంతపు సంతలలో ఎక్కువ. ఆ తర్వాత చెప్పుకో దగ్గ యాచకులు.



19. పాముల వాళ్ళు:

వీరు రైతు ఇంటి ముందు.... తమ బుట్టలో వున్న పాములను బయటకు తీసి పాముల బుర్ర వూదుతూ నాగు పాములను ఆడిస్తుంటారు. ఈలాంటి వారికి బిచ్చం తప్పని సరిగా వుంటుంది. ఈ పాముల వాళ్ళు... చెవిలో చీము కారుతున్న చిన్న పిల్లలకు పాము తోకను చెవిలో తిప్పితే చీము కారడం పోతుందని చెప్పి అలా చేసి కొంత ధాన్యాన్ని ఫలితంగా పొందు తారు. ఇంకా కొంత మంది ఎలాంటి విద్యలు ప్రదర్సించ కుండా కేవళం తమ కష్టాలను చెప్పుకొని యాచించె వారు కొందరుంటారు. అలాంటి వారికి తప్పని సరిగా బిచ్చం లభిస్తుంది. ఇలా రైతుల మీద ఆధార పడిన యాచకుల సంఖ్య చాల ఎక్కువే. ఆ రోజుల్లో రైతులు సుభిక్షంగా వున్నందున ఇలాంటి వారి జీవనానికి డోకా వుండేది కాదు. ఆరోజుల్లో యాచకులు ఎవరైనా ఇంటి ముంకు వస్తే ఎంతో కొంత బిచ్చం లభించేది. ఇది యాచకుల వృత్తి నైపుణ్యం కాదు. రైతుల, రైతు మహిళలు ఔదార్యమే ముఖ్య కారణం. ప్రస్తుతం ఇలాంటి వారి సంఖ్య పల్లెల్లో చాల వరకు తగ్గింది. రైతులే దీనావస్థలో వుంటే వీరి సంగతి పట్టించుకునే వారెవరు? ఇలాంటి వారు రైతుల పరిస్థితి గ్రహించి నగరాల పై బడ్డారు. గతంలో ఇలాంటి వారి ఆటలు పట్టణాలలో కొంత కాలం సాగింది. ఇప్పుడు పట్టణాలలో కూడా వీరిని ఆదరించే వారె కరువయ్యారు. పట్టణాలలో యాచలకు అన్నం పెడితే తీసుకోరు. వారికి డబ్బులు మాత్రమే కావాలి. చాలమందికి ఇది వృత్తి మారింది. ఈ యాచకులకు ఒక వ్వవస్త ఉంది. వీరి వెనుక కొంత మంది వుండి వారిని ప్రతి నిత్యం రద్దీగా వుండే స్థలానికి చేర్చి.... సాయంకాలం తిరిగి తీసుకెళ్లుతారు. వారి అన్న వస్త్రాలు ఆ నాయకులే చూసు కుంటారు. ప్రతిఫలంగా వారు యాచనలో సంపాదించిన దానిలో కొంత తీసుకొని మిగతా వారికి ఇస్తారు. ఈ వ్యవహారము పెద్ద పెద్ద పట్టణాలలోనె జరుగు తుంది. ఈ వ్వవస్థను ప్రభుత్వం ఏనాడో నిషేధించి యాచకులకు పునరావాసము కల్పించినా వారు అక్కడ వుండక నాయకుల అండలోనే జీవనం సాగిస్తున్నారు.



20. బుడబుక్కల వారు:

బుడబుక్క కళాకారుల వృత్తి భిక్షాటనమే అయినా వారి పట్ల జానపదుల్లో గౌరవాదరాలుండేవి. వారు గ్రామాల్లో పదాలు చెప్పుకొంటూ సంచరిస్తే తమకు శుభం జరుగుతుందని ఆనాటి గ్రామస్తుల నమ్మకం. అందుకే వాళ్ళను కసురుకోకుండా దానధర్మాలు చేసేవారు. బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్‌’ అని డమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.



21. వీదిగారడీవారు:

వీరు ఎక్కువగా దొమ్మరి వారై వుంటారు. వీరు కుటుంబంతో సహా పల్లెల్లో తిరుగుతు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. వీరు చేసె విన్యాసాలలో ముఖ్యంగ చెప్పుకో దగ్గవి..... అటు ఇటు కర్రలు పాతి వాటిమధ్యన ఒక దారాన్ని కట్టి ఆ దారంపై చిన పిల్లలను నడిపించడము., ఒకడు తన నడుంకు కట్టుకున్న గుడ్డ ఆధారంగా పొడవాటి కర్రను ఆనించి దానిపై చిన పిల్లలను ఎకించి విన్యాసాలు చేయించడము., ఇనుప రింగులలో తలను కాళ్ళను ఒకేసారి దూర్చి బయటకు రావడము, పిల్లలుచే శారీరిక విన్యాసాలు చేయించడము ఇలా అనేక విన్యాసాలు చేసి చివరకు ప్రదర్శన మధ్యలో గుడ్డ పరిచి, లేదా ప్రేక్షకుల వద్దకు వెళ్ళి యాచిస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా సంతలు, జాతరలు, ఇతర వుత్సవాలు జరిగే చోట ప్రదర్శిస్తుంటారు.



22. బుర్రకథ కళాకారులు:

ఒక ఇంటిముండు గంట వాయిస్తూ నిలబడ్డ దాసరి

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

Monday, January 14, 2019

త్రిపురనేని రామస్వామి


త్రిపురనేని రామస్వామి

 బాల్యంలో పందుంపుల్ల కోసం చెట్టుదగ్గరకెళ్లినపుడు అక్కడ వెండ్రుకలూ నిమ్మకాయలూ వంటివి కనిపిస్తే చిరుతిండికి పనికొస్తాయని డబ్బుల్నీ,ఆడుకోడానికి పనికొస్తుందని వేపబెత్తాన్ని తీసుకుని అందరూ నోరెళ్లబెట్టేలా చేసిన ఆకతాయి, తాను మిఠాయి తింటుంటే "నాకూ కొనిపెట్టవా ? " అని జాలిగా అడిగిన బ్రాహ్మణబాలుడికి సరే పోనీ పాపం అని కొని పెడుతుంటే ఆ బాపనకుర్రాడు "నువ్వు డబ్బులు మాత్రమే ఇవ్వు.ఆ మిఠాయిని తాకవద్దు" అంటే క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టిన  కుర్రాడు,బడికి ఆలస్యంగా ఎందుకొచ్చావని అడిగిన మాస్టారికి  "స్నానం చేసి రావడం వల్ల " అని సంజాయిషీ ఇచ్చి " ఏమిటి ? అబ్రాహ్మణులకు కూడా ఉదయపు స్నానమా ! అన్నారని మాస్టారిని ఎదిరించి, ఫలితంగా పాఠం అయ్యేవరకూ నిలబడి ఉండాల్సొచ్చిన ధైర్యశాలి ,"అందరూ సమానులు కాదా ? బ్రాహ్మణుల ఆధిక్యత ఏమిటి ? అబ్రాహ్మణుల అల్పత్వం ఏమిటి ? "అనే ప్రశ్నలు బాల్యంలోనే సంధించిన హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి కృష్ణాజిల్లా అంగలూరు లో చలమయ్య రామమ్మ దంపతులకు 15-1-1887లో జన్మించాడు.

ఈయన ఇంగ్లండులో బారిష్టరు చదివి బందరు,బెజవాడలలో వకీలుగా పనిచేసి చివరకు తెనాలిలో స్థిరపడ్డారు. పురాణాలమీదా  బ్రాహ్మణసంప్రదాయాల మీదా ( బ్రాహ్మణులమీద కాదు ) తిరుగుబాటు చేశారు. న్యాయవాదిగా కోర్టులో ఒక సాక్షిని నువ్వు అని సంబోధించినందుకు న్యాయాధిపతి " అతను బ్రాహ్మణుడు" ఏకవచనం కూడదు "మీరు" అని సంబోధించాలి ' అంటే " నాకు ఏకులమైనా ఒక్కటే "  అని టక్కున సమాధానమిచ్చారు . త్రిపురనేని కోపం బ్రాహ్మణుల మీద కాదు.వారి ఆచారాలమీదే !కాబట్టే ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఒక బ్రాహ్మణ యువకుడికి ఉద్యోగం ఇప్పించమని చీటీ రాసి పంపిస్తే తెనాలి మున్సిపాలిటీలో ఉద్యోగం వేయించారు. మూడాఛారాలను ఎదుర్కోడానికి యువజన సంఘాన్నిస్థాపించారు.రాముడు శంభూకుడి శిరస్సు ఖండించిన ఘట్టాన్నిచదివి కంపించిపోయి తన ఇంటిపేరును 'శంభుకాశ్రమం' గా మార్చారు. *రాముడు దేవుడుకాదనీ,పురాణాలు కట్టుకథలనీ,భగవద్గీత కల్పితమనీ ,భారత రామాయణాలూ ధర్మశాస్త్రాలూ ఒకవర్గం తన అధికారం కోసం రాసిన గ్రంధాలనీ ప్రచారం చేశారు.* మారీసుపేటలో బ్రాహ్మణులు ఒక మేకను తెచ్చి యజ్ఞం చేయాలనుకుంటే దాన్ని ఈయన భగ్నం చేశారు. *వేదాలు దైవం అయితే వాటిని ఒక రాక్షసుడెలా మింగ గలిగాడు? అని ప్రశ్నించారు?'వేదాలు ఎలా పుట్టాయో ,ఋషులదగ్గరకెలా వచ్చాయో వేదాల్లోనే ఉందా !చక్కని కథ.పిల్లలకు చెప్పడానికి బాగుంటుంది' అని ఎద్దేవా చేసారు.* మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. *"శుభా శుభ కార్యాలన్నీ బ్రాహ్మణులే చేయించాలని ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు"*  అన్నారు.

*పెళ్లి అనేది వ్యక్తిగత విషయం.దేవుడికీ మతానికీ సంబంధం లేదు.పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తం రాముణ్ణి అడవులపాలు చేసిన సంగతి మనకు తెలుసు.లగ్నాలు కుదరడం లేదని రోహిణీ కార్తెలో ఏ రెండుజాములకో పెళ్లిళ్లు కుదిర్చి అందరికీ చీకాకు కల్పించడం ఉచితమా?"*  అంటూ పెళ్లి విధానాలను వివరిస్తూ " వివాహ విధి " అనే పుస్తకం రాశారు.ఇది ఆ రోజుల్లో ప్రజాభిమానాన్ని పొందింది.భగవంతుడికి సంస్కృతభాషే ఇష్టమని తలిచే ఈ మూఢలోకానికి పెళ్లి మంత్రాలు తెలుగులో కూడా ఉండవచ్చని ఎలాచెప్పాలి?అన్నారు.ఆయన చేసిన పెళ్లిళ్లలో "అగ్నిసాక్షిగా " అని కాక "పెళ్లిపెద్దల సాక్షిగా " అనిప్రమాణం చేయించేవారు.

*పురాణాలు వ్యాససృష్టి కాదనీ అవన్నీ కల్పితాలనీ సూతుడు తనకు చెప్పినట్టు "సూతపురాణం" లో రాశారు.* విశ్వనాథవారు "వేనరాజు"నాటకంలో వేనరాజుకి ఘోరం తలపెట్టారని విమర్శించి "ఖూనీ" అనే నాటకాన్నిరచించారు.భగవద్గీతకు అధిక్షేపణగా బ్రహ్మనాయుడు బాలచంద్రునికి బోధించినట్టుగా తానొక భగవద్గీతను రాశారు.'కుప్పుసామి' అనే ద్రావిడుల దేవుడిపేరు మీద ఒక నీతిశతకాన్ని రచించారు.చచ్చిపోయిన జీవి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడని చెబుతూనే మళ్ళీ పిండాలు పెడతామని పిలవడం ఎందుకు? అని ప్రశ్నించారు. *1929లో ఒంగోలు తాలూకా కాకర్లపాడులో  పితృకార్యంలో తగిన దక్షిణ ఇవ్వలేదని  ఒక వైశ్యుడిని బ్రాహ్మణులు చితగ్గొడితే బాధితుడిపక్షాన వాదించి వారికి జరిమానా వేయించారు.*

*త్రిపురనేనికి సమయ స్ఫూర్తీ చమత్కారం సహజంగా అలవడ్డాయి.* ఒక భక్తుడు ఆయన్ని " మీరు నాస్తికులుకదా ! దేవుడొక్కడే అనే ఆస్తికుల ఆర్య సమాజంలో ఎలా చేరారు?" అని ప్రశ్నిస్తే "  33 కోట్ల దేవతలున్న హిందూసమాజంవారిని ఆర్య సమాజం వారు ఓడించేస్తే ,ఆర్య సమాజం వారి ఒక్కదేవుడితో నేను కుస్తీపట్టి ఓడిస్తాను" అన్నారు. *ఎవరైనా వచ్చి " మా దేవుడికి రెండుపువ్వులివ్వండి" అంటే " కావాలంటే మీ దేవుణ్ణి తీసుకొచ్చి ఈ చెట్టుకింద పెట్టండి.పువ్వులు చెట్టుకి ఉంటే అందం కానీ కోసేస్తే ఏముంటుంది? "*  అనేవారు. ఒక పురోహితుడాయన్ని " మీకు మంచితనంతో పాటు దైవ చింతన ఉంటే బాగుండేది" అంటే " చింతా ,సీమ చింతా తెలుసు.ఈ దైవచింత గురించి నాకు తెలియదు.అని చమత్కరించారు.ఒక శాస్త్రిగారాయన్ని *'రాముణ్ణి విమర్శించే మీరు రామస్వామి అనేపేరెందుకు పెట్టుకున్నారు?' అనడిగితే  "స్వామి అంటే మొగుడు అని అర్ధం.అంటే నేను రాముడికి మొగుణ్ణి "అన్నారు* .ఒక పండితుడు *"ధర్మము కృతయుగంలో నాలుగు పాదాల నడిచింది" అంటే " ఆ కాలంలో అందరూ పశుప్రాయులన్నమాట"*  అన్నారీయన.
.లండన్ లో ఒక స్త్రీ ఆయన్ని " మీరు టోపీ ధరిస్తే మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా! " అంది.వెంటనే ఈయన "మీరు చీరె, రవికె ధరిస్తే మంచి రాకుమారుణ్ణిచ్చి పెళ్లి చేస్తాను "అన్నారు. *గాంధీ టోపీ అంటే ఆయనకి అసహ్యం కలగడానికి కారణముంది. గాంధీగారు దక్షిణాఫ్రికాలో జైలులో ఉన్నపుడు తెల్లవారికీ నల్లవారికీ భేదం తెలియడంకోసం సూపరింటెండెంట్ గాంధీ గారికి తెల్ల టోపీ తగిలించాడు.జైలునుంచి వచ్చాక కూడా గాంధీ దాన్ని కొనసాగించారు.* త్రిపురనేని శాకాహారి.ఓ విందులో తాపీ ధర్మారావుగారాయన్ని" మీరు తృణభక్షకులు(grass eaters) " అన్నారు.వెంటనే ఈయన "మీరు శవభక్షకులు" అని బదులిచ్చారు.

ఇతిహాసకథల్లోని కల్పనలపై కూడా త్రిపురనేని ధ్వజమెత్తారు. రాజరాజ నరేంద్రుడు,చిత్రాంగి కథ మాళవదేశానికి సంబంధించిందనీ కవులు దీన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన భారత కృతికర్త రాజరాజనరేంద్రుడికి అంటగట్టారన్నారు.కృష్ణుడి మేనత్త రాధ నందుని చెల్లెలనీ ,అతనితో సయ్యాటలాడిన రాధ వేరని వివరాలతో చెప్పారు.అలాగే చంద్రవంశపు దశరథుడి కుమార్తె శాంతను ,సూర్యవంశపు రాజైన రాముడి తండ్రి దశరథుడికి కూతుర్నీ,సీతకు ఆడబిడ్డనూ  చేశారన్నారు.

త్రిపురనేనికి  జాతీయాభిమానం తక్కువేమీ కాదు.ఐర్లాండ్ వెళ్ళినపుడు ఒక ఆంగ్లేయుడు 'భారతీయులది దాస్యబుద్ధి ' (slavish mentality)అన్నాడని రొట్టె కోసే కత్తిని పైకెత్తి 'మళ్ళీ ఆ మాట అంటే నీ నాలుక కోసేస్తాను'అన్నారు.ఆ తెల్లవాడు నోరెత్తితే ఒట్టు.బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల ప్రభావంతో "రాణాప్రతాప్ " అనే నాటకాన్ని, *ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో " వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో తెల్పుడీ* .వంటి గేయాలనూ రాశారు.

*ఆంద్ర మహాసభ సభ్యులచే "కవిరాజు " అనే బిరుదు పొందిన త్రిపురనేని16-1-43న మరణించారు.తాను చెప్పిందే నమ్మమని ఆయన ఎవరికీ చెప్పేవారు కాదు."చదవండి.ఆలోచించండి.మీరే ఒక నిర్ణయానికి రండి"*  అనేవారు.అందుకే ఆయన కుమారుడు *గోపీచంద్ తన 'అసమర్ధుని జీవయాత్ర' నవలను "ఎందుకు? అని ప్రశ్నించడం నేర్పిన నాన్నగారికి "* అంకితం అన్నారు.

పురాణాలు,హిందూ సంస్కృతి, ఛాందసభావాలపై  తీవ్రంగా దాడిచేసి,బ్రాహ్మణత్వ ఆధిక్యతను నిరసించి గొప్ప హేతువాదిగా ప్రశంసలందుకున్న త్రిపురనేని స్వీయకులాభిమానం ప్రదర్శించి అపఖ్యాతి మూటకట్టుకున్నాడు.తమకులంవారు గౌరవం పొందాలంటే విద్యావంతులవ్వాలనీ,తమ అభిప్రాయప్రకటనకోసం తమ కులానికో పత్రిక ఉండాలనీ చెప్పడమే కాదు కమ్మవారు క్షత్రియులు అనే వింతవాదాన్ని కూడా తీసుకొచ్చాడు. *ఇలాంటి పరిమితులను పక్కనపెట్టి హిందూ మతోన్మాదం విజృంభిస్తున్న ఈనాడు యువతరం త్రిపురనేని సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ( త్రిపురనేని రామస్వామి జీవితం సాహిత్యం )

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు
సెల్ : 9493033534