Friday, November 23, 2018

పరవస్తు చిన్నయసూరి


పరవస్తు చిన్నయసూరి
పరవస్తు చిన్నయ సూరి (1809-1861) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే.

బాల్యం

చిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వేంకటరంగయ్య. జన్మనామం చిన్నయ. చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.

చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.

ఉద్యోగం, రచనా ప్రస్థానం

చిన్నయ మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు. సూరి అనగా పండితుడు అని అర్థం.

రచనలు

అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, ఆంధ్రకౌముది, ఆంధ్రధాతుమాల, ఆంధ్రశబ్ద శాసనము, అకారాది నిఘంటువు, ఆదిపర్వవచనము - 1847, ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము, చాటు పద్యములు, చింతామణివృత్తి - 1840, పచ్చయప్ప నృపయశోమండనము - 1845, పద్యాంధ్ర వ్యాకరణము - 1840, బాల వ్యాకరణము - 1855, బాలవ్యాకరణ శేషము, నీతిచంద్రిక - 1853, నీతిసంగ్రహము - 1855, యాదవాభ్యుదయము, విభక్తి బోధిని - 1859, విశ్వ నిఘంటువు, శబ్దలక్షణ సంగ్రహము - 1853, సుజనరంజనీ పత్రిక, సంస్కృత బాలబోధ, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము - 1844.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు 

దేవులపల్లి కృష్ణశాస్త్రి

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్నిమలుపు తిప్పిన ఓ చిన్నసంఘటన.

మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…

ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…

కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…

తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళించేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా..

పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…

పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..
మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…

గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…

అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…

ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .

“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…

మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వారమైన మనకే ఎంతో అవమానం…

ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..

అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..

“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”

అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…

కూతురిని కోల్పోయిన బాధ కృష్ణ శాస్త్రి గారిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా కుంగ తీసిందనే చెప్పాలి…

అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా వారిని చుట్టు ముట్టి మరింత ఉక్కిరి బిక్కిరి చేసాయి…

“..ఈ గంగాకెంత గుబులు…ఈ గాలికెంత దిగులు.. ” అంటూ ప్రకృతిలోని ఎన్నిటి గురించో దిగులు పడ్డ శాస్త్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చెప్పు కోలేని బాధలనుభవించారు…

సరిగ్గా ఆ సమయంలోనే మరపురాని ఓ చిన్న సంఘటన ఆ రోజుల్లో జరిగింది..

చిన్నదే అయినా ఆ తరవాతి కాలంలో ఈ మహత్తర సంఘటన వలన మనం కొన్ని మధురమైన పాటల్ని వినగాలిగాం…

తెలుగు చిత్ర పరిశ్రమలో బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ సంఘటన 1974-75 ప్రాంతంలో మదరాసు మహాపట్టణం లోని ప్రముఖ సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీ రావు గారింట్లో జరిగింది..

మద్రాసు కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులూ ఆరు కాయలుగా కళ కళ లాడుతుందే రొజులవి…

చిత్ర పరిశ్రమకు సంభందించిన చిన్నాపెద్దా అందరూ అప్పట్లో మద్రాసులోనే వుండేవారు..

గొల్లపూడి మారుతీ రావు గారు కూడా మద్రాసులోనే వుండేవారు..

ఈ మహత్తరమైన సంఘటన జరిగిన రోజున పొద్దున్న పూట ఎప్పట్లాగే తన పనులు ముగించుకొని ఉదయం 8.30 గంటల సమయంలో మారుతీరావు గారు బయటి కెళ్ళటానికి సిద్దమవుతుండగా ఒక ఫియట్ కారొచ్చి ఆయన ఇంటి ముందాగింది ..

“.. పొద్దున్నేఎవరో మహానుభావులు..” అనుకుంటూ మారుతి రావు గారు కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు..

ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ కారు లోంచి మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కిందకి దిగారు..

అంతటి మహనీయులు తన ఇంటికొచ్చారనే ఆనందంతో కాసేపు ఉబ్బితబ్బిబ్బయినా వెంటనే తేరుకొని మారుతీ రావు గారు శాస్త్రి గారికి ఎదురెళ్లి సాదరంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు..

కాఫీ ఫలహారాలు అవీ పూర్తయిం తరువాత శాస్త్రిగారు తన కేదో విషయం చెప్పాలనుకొని కూడా చెప్పటానికి సంశయిస్తున్నారని అర్థం అయ్యింది మారుతీ రావు గారికి..

మెల్లిగా తను కూర్చున్న కుర్చీ లోంచి లేచి.. శాస్త్రి గారికి దగ్గరగా వచ్చి.. ముందు కొంగి..ఆయన మోకాళ్ళ మీద చేతులేసి.. ఆయన మొహంలోకి చూస్తూ…లోగొంతుకలో ఎంతో ఆప్యాయంగా అడిగారు మారుతీ రావు గారు..

“మాస్టారూ మీరు నాతో ఏదో చెప్పాలనుకొని కూడా చెప్పలేక పోతున్నారు..నా దగ్గర కూడా సంశయిస్తే ఎట్లా చెప్పండి.. అంత మరీ పరాయి వాడినయి పోయానంటారా …”

తానెంతో ఆరాధించే తన గురువు గారు తన ముందు గూడా మొహమాట పడుతున్నారన్న అక్కసుతో కావాలనే కాస్త నిష్టూరాలాడుతూ మాట్లాడారు మారుతీరావు గారు..

అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన..
ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…
మీరే చదవండి .తెలుస్తుంది .

శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది…

అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా ఒక పలకా బలపం చేతిలో పట్టుకొని వెళ్ళేవారు…

ఎవరికేం చెప్పదలుచుకున్నా ఆ పలక మీదనే రాసి చూపించేవారు…

మారుతీ రావు గారు తన దగ్గరికొచ్చి అలా అడగంగానే శాస్త్రి గారు ముందుగా ఒక పేలవ మయిన జీవం లేని నవ్వు నవ్వారు…

ఆ తరువాత తల వొంచుకొని పలక మీద చిన్నచిన్న అక్షరాలతో దాదాపు ఓ రెండు నిమిషాలపాటు చాలా పొందికగా ఏదో రాస్తూ ఉండిపోయారు…

ఆ తరువాత అదేంటో చదవమని పలక మారుతీ రావు గారి చేతి కిచ్చారు…

అందులో ఏముందో చదవటానికి మారుతీ రావు గారికి ముందొక పావు నిమిషం పట్టింది…

ఆ తరువాత అందులోని విషయాన్ని సంగ్రహించి జీర్ణించు కోవటానికింకో అర నిమిషం పట్టింది…

ఆ పైన లోపలి నుండి తన్నుకుంటూ వొస్తున్న దుంఖాన్ని ఆపుకోవటానికి మరో నిమిషం పట్టింది…

“.. నాకుషస్సులు లేవు..ఉగాదులు లేవు.. ” అంటూ తెలుగు సాహితీ లోకాన్నిఉర్రూతలూగించిన ఈ మహా మనీషి జీవితంలోంచి నిజంగానే ఉషస్సులూ  ఉగాదులూ  వెళ్లిపోయాయా అనుకుంటూ కాసేపలా మౌనంగా ఉండిపోయారు మారుతీ రావు గారు…

ఏం సమాధానం చెప్పాలో వెంటనే అర్థం కాలేదు…అసలు అట్లాంటి విపత్కర పరిస్థితి ఒకటి తన జీవితంలో వొస్తుందని కూడా ఆయన ఏనాడు ఊహించలేదు…

అయినా వెంటనే తనను తాను తమాయించుకొని తలఎత్తి శాస్త్రిగారే వేపు కాసేపలా చూస్తూ ఉండి పోయారు..

“..పెరిగి విరిగితి విరిగి పెరిగితి…కష్ట సుఖముల సార మెరిగితి…పండుచున్నవి ఆశ లెన్నొ…ఎండి రాలగ పోగిలితిన్…” అన్నంత దీనంగా వుంది అప్పటి కృష్ణ శాస్త్రి గారి ముఖస్థితి..

ఎప్పుడూ తళతళ లాడే జరీ అంచు వున్నపట్టు పంచెలొ కనపడే శాస్త్రి గారు ఆ సమయంలో కేవలం ఒక మామూలు ముతక పంచెలో కనపడ్డారు…

చాలా బేలగా మారుతీరావు గారి వేపు చూస్తున్నారు…

దుఃఖాన్ని దిగమింగుకొని మారుతీరావు గారు మళ్ళీ పలక వేపు చూసారు…

“మారుతీ రావూ…నా పరిస్థితులేమి బాగా లేవయ్యా…చాలా ఇబ్బందుల్లో వున్నాను…ఓ ఇరవై వేలు అర్జెంటుగా కావాలి…అందుకని నా కారు అమ్మేద్దామనుకుంటున్నాను…

నీ ఎరకలో ఎవరన్నా స్తితిమంతులుంటే చెప్పు…అమ్మేద్దాం…నాకు తెలుసు నువ్వు చాలా బిజీగా ఉంటావని…కానీ తప్పలేదు.. అందుకే పొద్దున్నే వచ్చినిన్ను ఇబ్బంది పెట్టాల్సోచ్చింది…

నా కోసం ఈ పని చేసి పెట్టవయ్యా మారుతీ రావు…గొప్పసాయం చేసిన వాదివవుతావ్…”

తన కనురెప్పలు వాలిస్తే ఎక్కడ తన కంట్లో నీళ్ళు జారిపడి మాస్టారిని మరింత బాధ పెడతాయో అని తనను తాను సంభాళించుకుంటూ మారుతీ రావు గారు శాస్త్రి గారి మొహంలోకి కాసేపలా తదేకంగా చూస్తూ ఉండిపోయారు..

ఆ తరువాత మెల్లిగా లేచి వెళ్ళి శాస్త్రిగారి కాళ్ళ దగ్గర కూర్చొని

“..మాస్టారు…మీ పరిస్థితి నాకర్ధమయ్యిందండీ..కాని కారు గూడా లేకుండా ఈ మహ పట్టణం లో ఏమవస్థలు పడతారు చెప్పండి…మీరు  అన్యధా భావించనంటే ఒక్క మాట…చెప్పమంటారా..” అంటూ ఆయన మొహంలోకి చూస్తూ ఆయన అనుమతి కోసమన్నట్టుగా ఆగారు మారుతీరావు గారు…

అదే పేలవమయిన నవ్వుతో చెప్పూ అన్నట్టుగా తలాడించారు శాస్త్రిగారు…

“..ఆ ఇరవై వేలు నేను సర్దుబాటు చేస్తాను…ఆహా…అప్పుగానే లెండి…మీకు వీలు చిక్కినపుడు ఇద్దురు గాని…నాకేమంత తొందరా లేదు అవసరమూ లేదు…దయచేసి నా మాట కాదనకండి …”

వెంటనే తల వొంచుకొని శాస్త్రిగారు మళ్ళీ పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు…

“..నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకిష్టం లేదయ్యా..”.. ఇదీ శాస్త్రిగారు రాసింది..

“….అయ్యా నాకేమి ఇబ్బంది లేదండి…తండ్రి లాంటి వారు మీరు ఇబ్బందుల్లో వుంటే చూస్తూ వూరుకోమంటారా చెప్పండి…అయినా దేవుడి దయ వలన నా పరిస్థితి బానే వుంది లెండి…ఇంక మీరు దయ చేసి నా మాట కాదనకండి…”

దానికి శాస్త్రిగారు ముందు కాస్త పేలవంగా నవ్వినా ఆ తరువాత కష్టాల నెన్నిటినో కడుపులో దాచుకొని తన పిల్లల కోసం ఒక నాన్న నవ్వే ప్రేమ పూరితమైన చిరు నవ్వు నవ్వారు..

దాన్నే అంగీకార సూచకంగా భావించి మారుతీరావు గారన్నారు..

“..మాస్టారూ..ప్రస్తుతానికి అంత డబ్బు ఇంట్లో లేదు…బ్యాంకు నుండి తీసుకురావాలి..సాయంత్రం కల్లా తెప్పించి పెడతాను…పర్వాలేదు కదా…”

“.. ఏమీ పర్వాలేదు ” అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు…

ఆ తర్వాత ఇంక బయలుదేరుతాను అన్నట్టుగా లేచి నిలబడ్డారు..

వారిని సాగనంపటం కోసం గేటు దాకా వచ్చి కార్ డోర్ తీసి నిలబడ్డారు మారుతీరావు గారు…

కారెక్కుతుండగా ఆగి మళ్ళీ తన చేతిలో పలక మీద ఏదో రాసి మారుతీరావు గారికి చూపించారు శాస్త్రిగారు…

“..డబ్బులు తీసుకోవటానికి సాయంత్రం నన్ను ఎన్నింటికి రమ్మంటావ్..”..ఇదీ దాని సారాంశం…

గుండె  పగిలినట్టుగా అనిపించింది మారుతీ రావు గారికి….కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నారు..

“..అయ్యా డబ్బులు తీసుకోవటం కోసం మిమ్మల్నిమళ్ళీ మా ఇంటికి రప్పించి పాపం మూట గట్టు కోమంటారా చెప్పండి …మీకా శ్రమ అక్కర్లేదు లెండి…. సాయంత్రం నేనే డబ్బు తీసుకొని మీ ఇంటికి వస్తాను… సరేనా “

“..సరే…అట్లాగే  రావయ్యా …వచ్చి భోంచేసి వెళ్ళదు గాని…'” అని మళ్ళీ పలక మీద రాసి మారుతీరావు గారికి చూపించి కారేక్కారు శాస్త్రిగారు..

వారి సంస్కారానికి ఓ నమస్కారం చేసి వారిని సాగ నంపారు మారుతీ రావు గారు…

అన్నట్టుగానే ఆ సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో డబ్బు తీసుకుని శాస్త్రి గారింటికి వెళ్ళారు మారుతీ రావు గారు…

వారికి డబ్బులందించి భోజనాలు చేసి బయలు దేరే ముందు శాస్త్రి గారితో అన్నారు మారుతీ రావు గారు…

“..మాస్టారు…మరీ చనువు తీసుకుంటున్నాననునుకోకపోతే ఓ మాట అడగచ్చంటారా..”
అడుగు అన్నట్టుగా తలూపారు శాస్త్రిగారు..

“..వీలయితే మళ్ళీ పాటలు రాస్తారా….నవతా వాళ్ళేదో కొత్త సినిమా తీస్తున్నారుట…దాంట్లో ఏదో తెలుగు భాషకు సంబంధించి ఒక పాట పెడదా మనుకుంటున్నారట..మిమ్మల్ని అడిగే ధైర్యం లేక నన్నడిగారు.. కనుక్కొని చెబుతానన్నాను…మళ్ళీ పాటలు రాయకూడదూ..మీకూ కాస్త వ్యాపకంగా వుంటుందీ..ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరి నాలుగు రాళ్ళూ వస్తాయి…ఏం చెప్పమంటారు…”

“..సరే కానీవయ్యా.. నీ మాటెందుకు కాదనాలి..”..పలక మీద రాసి చూపించారు శాస్త్రిగారు…

ఆ తర్వాత కొన్నాళ్ళకు నవతా వారి సినిమా సాంగ్ రికార్డింగ్ A V M స్టూడియో లో ప్రారంభ మయ్యింది….

ఆ రోజక్కడ రికార్డింగ్ లో సంగీత దర్శకులు జి కే వెంకటేష్ గారు,కృష్ణశాస్త్రి గారూ,ప్రముఖ గాయని సుశీల వంటి మరి కొంతమంది ప్రముఖులు కూడా  వున్నారు…

అందరూ కూడా శాస్త్రిగారు రావటంతో చాల సంతోషంగా వున్నారు..

ముందుగా శాస్త్రిగారి పాటతో రికార్డింగ్ మొదలయ్యింది..

మధ్యలో శాస్త్రి గారు రాసిన చరణంలో ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చి జి కే వెంకటేష్ గారు శాస్త్రి గారి దగ్గర కొచ్చి ఏదో చెవిటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద గొంతుతో అడిగారు

“…అయ్యా  మీరిక్కడేదో రాసారు గాని మీటర్ ప్రాబ్లం వచ్చేలా ఉంది…ఈ పద మేమన్నా కొంచెం మార్చ గల రేమో చూస్తారా  ” అని…

దానికి సమాధానంగా శాస్త్రిగారు తన పలక మీద ఇలా రాసారు..

“.. దానికేం భాగ్యం..తప్పకుండా మారుస్తాను.. కానీ  ఒక చిన్న విషయం…నేను మాట్లాడలేను గాని నా చెవులు బాగానే పని చేస్తున్నాయి…గమనించ గలరని మనవి “..

అది చదివి జి కే వెంకటేష్ గారితో సహా అక్కడున్న పెద్దలందరూ శాస్త్రి గారి సెన్స్ అఫ్ హ్యుమర్ కి హాయిగా నవ్వేశారు…

ఆ తర్వాత శాస్త్రిగారి పాటతో సహా ఆ సినిమాలోని అన్ని పాటల రికార్డింగ్ పూర్తయిపోయాయి..

సినిమా కూడా షూటింగ్ ముగించుకొని విడుదలై పెద్ద హిట్ అయ్యింది..

ఆ సినిమా కోసం శాస్త్రిగారు రాసిన పాట ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఏదో మూల వినపడుతూనే ఉంది ..

ఆ పాటే…
అమెరికా అమ్మాయి లోని “…పాడనా తెలుగు పాట…పరవశమై మీ ఎదుట మీ పాట..”

ఉపసంహారం

ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు మరికొన్ని మంచి పాటలు మనకందించారు…

వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి…

“..ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం..”,(కార్తీక దీపం)

“.. గొరింటా పూసింది కొమ్మా లేకుండా…”,(గోరింటాకు)

“..ఈ గంగకెంత దిగులు…ఈ గాలి కెంత గుబులు..”,(శ్రీరామ పట్టాభిషేకం)

“..ఆకులో ఆకునై పూవు లో పూవునై..” (మేఘసందేశం)

మొదలైనవి…

ఆ తరువాత వయోభారం వలన శాస్త్రిగారు పాటలు రాయటం పూర్తిగా తగ్గించేసారు..

“..నారాయణ నారాయణ అల్లా అల్లా…నారాయణ మూర్తి నీ పిల్లల మేమెల్లా..” అంటూ పరబ్రహ్మ ఒక్కడే అని ఎంతో సున్నితంగా లోకానికి చాటి చెప్పిన విశ్వకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు

తన కవితామృతం తో తెలుగు శ్రోతల్నిఅమరుల్నిచేసినా తాను  మాత్రం నింపాదిగా మనదరినీ వదిలేసి “..నీ పదములే చాలూ…  రామా…నీ పద ధూళియే పదివేలూ ..” అంటూ ఫిబ్రవరి 24,1980 నాడు తన శ్రీరాముడి పాద ధూళిని వెతుక్కుంటూ వేరే లోకాల వేపు సాగిపోయారు..

ముక్తాయింపు

“…అంత లజ్జా విషాద దురంత భార…సహనమున కోర్వలేని ఈ పాడు బ్రతుకు…మూగవోయిన నా గళమ్మునను గూడ…నిదుర వోయిన సెలయేటి రొదలు గలవు…ఇక నేమాయె…” --కృష్ణపక్షం. జాతీయగీతం అనిపించే ‘జయ జయ ప్రియభారత జనయిత్రి’ రచయిత గానేకాక ఎన్నో సినీ లలితగీతాలను మనకందించిన శ్రీ దేవులపల్లి వారిగురించిన ఈ వ్యాసం చాల చాల బాగుంది. చదివి సంతోషిస్తారు అనుకుంటాను.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు 

Tuesday, November 6, 2018

సాహిత్య భగీరధుడు - దాశరధి

సాహిత్య భగీరథుడు - దాశరధి

అరిశిరస్సుల నుత్తరించిన / అలుగునేనే తెలుగు నేనే
అఖిలజగములు చుట్టివచ్చే / పులుగు నేనే, తెలుగునేనే

తెలుగు నేనే, వెలుగునేనే... అని విశ్వరూపాన్ని ప్రద ర్శించిన మహాకవి దాశరధి. ఆయన మహాంధ్రోదయం’’ తెలుగు ఊరులు, తెలుగు వారలు ప్రతిఫలించేకావ్యం. దాశరధికి కావలసింది మహాంధ్రోర్వర. అందుకే తూ రుపు దారికెదురుగా ఉన్న ద్వారబంధాన్ని, మనిషి మన స్సుదారుల రాగబంధంగా వీక్షించాడు. మూడు కోటుల నొక్కడే ముడి బిగించి, మహాంధ్ర సౌభాగ్యగీతాన్ని ముక్త కంఠంతో ఆలపించి అఖిలాంధ్ర ప్రజల హృదయ తంత్రులను మీటిన మేటికవి దాశరధి కృష్ణమా చా ర్యులు. దాశరధి 1927 సెప్టెంబరులో వరంగల్లులోని మానుకోట తాలూకాలోని గూడూరు గ్రామంలో జన్మిం చారు. దాశరధి పుట్టుకతోనే అగ్నిశిఖలాంటి ప్రతిభా మూర్తి. చిన్నతనంలోనే కవితా వ్యవసాయం చేపట్టాడు. ఆ రోజుల్లో కవిసమ్మేళనాల్లో ఈ కవి గొంతెత్తి కవితా గానం చేస్తుంటే ఎవరీ కుర్రకవి, అంటూ అందరూ ఆశ్చ ర్యపోయేవారట. ఆయన జీవితాన్ని ఒక మహా కవితా యజ్ఞంగా భావించారు. అందుకే దాశరధి ఒక మహా కవిగా, ప్రజాకవిగా, ఉద్యమోపజీవిగా జనం గుండెల్లో నిలచిపోయారు. చెట్టుకి ఆకులు వచ్చినట్లుగా కవికి కవి త్వం రావాలని. లేని కవితావేశాన్ని బలవంతాన తెచ్చి పెట్టుకోకూడదు. కవిత్వంగా సహజంగా రావాలి అన్నంత సహజమైనది దాశరధి కవిత్వం. అందుకు మచ్చుతునక ఈ పద్యం.
‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి / ఆకాశ మంత యెత్తార్చినాను / నేను రాక్షసి గుండె నీరుగా, పద్యాలు / పాడి మానవుని కాపాడినాను / నేను వేస్తంభాల నీడలో నొకతెల్గు / తోట నాటి సుమాలు దూసినాను / నేను పోతన కవీశాను గంటములోని / ఒడుపుల కొన్నింటి బడసినాను / కోటి తమ్ములకడ రెండుకోట్ల తెలుగు / టన్నలను గూర్చి వృత్తాంత మం దజేసి / మూడు కోటుల నొక్కటేముడి బిగించి / పాడి నాను మహాంధ్ర సౌభాగ్యగీతి’’ కొదమ సింహం గర్జిం చినట్లుగా ఉన్న ఈ పద్యాన్ని చూస్తే మహాకవి కలం ఏమిటో సాక్షాత్కరిస్తుంది. మాతృభూమిని, మా తృభాష లను మెన్నతంగా భావించి పులకించిన వైనం దాశర ధిలో కనిపిస్తుంది. మహాంధ్రోదయంలోని తెలంగాణ అనే మొదటి ఖండికలో మాతృభూమిని వేనోళ్ల ప్రశంసిస్తాడు.

కోటి తెలుగుల బంగారు కొండ క్రింద /  పరుచుకొ న్నట్టి సరసులోపల వసించి / ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు / నా తెలంగాణ తల్లి కంజాత తల్లి అని అనడంలో ‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’’
అనే ఆర్యోక్తి అభివ్యక్తీకరించబడింది. తనను కని, పెం చి, పెద్దచేసి మెజ్వల జీవితాన్ని ప్రసాదించిన తెలం గాణ తల్లిని కంజాత తల్లిగా కొనియాడి తన కృతజ్ఞతను చాటుకున్నాడు.

ఆధునిక ప్రపంచంలో ఏ దేశంలో నైనా వర్గసంఘర్షణ, ప్రచ్ఛన్న యుద్ధాలు కనబడుతూనే ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం చంద్రమండలానికి దారితీసినా, మారణె మాని కి కూడా వినియోగించబడుతుంది. విజ్ఞానం రాజకీయ స్వార్ధ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఆర్ధి క అసమానతలు పొడచూపుతూనే ఉన్నాయి. తత్ఫలి తంగా ప్రపంచశాంతికీ, మానవత్వానికీ స్థానం ప్రశ్నా ర్థకమవుతుంది. మనిషి కోసమే ఈ ప్రపంచం అనేవాళ్లు సైతం మానవతావాదాన్ని పెడదోవ పట్టిస్తున్నారు. భా రతీయులు ప్రజాస్వామ్యవాదులు, ప్రపంచ శాంతి కాముకులు.

‘‘ ఏనాడెవ్వడూ కత్తితో గెలువలేదీ విశ్వమున్, ప్రేమ పాశానన్ కట్టుము నాలుగుంబది ప్రపంచాలన్’’  అంటూ శాంతి లేకపోతే మానవజాతికి మనుగడే లేదు అనే సత్యాన్ని గుర్తించి, లోకమంతా శాంతిపథంలో నడవాలని ఆశించి క్రాంతి కలాన్ని, శాంతి ఖడ్గాన్ని చేతపట్టి కవన, కదన రంగాలలో స్వైరవిహారం చేసిన మానవతామూర్తి దాశరథి. శాంతి ప్రభోదాత్మకమైన కవితా ప్రపంచంలో దాశరథి ‘‘కపోతసందేశం’’ అగ్రశ్రే ణికి చెందిన కావ్యం. ఇందులో హింసను, దానవాంశను నిరసించి, శాంతిని, మానవత్వాన్ని నెలకొల్పే శాంతి సందేశాన్ని కపోతం ద్వారా లోకానికి అందిస్తాడు. శాంతి కోసం ఇతను చెందిన ఆవేదన అంతులేనిది. కనీసం కావ్యాల్లో నైనా శాంతిని బతికించాలని రచయితలకు సందేశాన్ని ఇచ్చిన దాశరధి శాంతి ప్రియత్వం ఎంతో మహత్తరమైనది. గౌతమ బుద్ధుడు, క్రీస్తు, గాంధీ మహాత్ముడు. ఈ ముగ్గురూ అహింసామూర్తులు, శాంతి దూతలు. వీరిజీవితాలు లోకకళ్యాణానికి, విశ్వసౌభాగ్యా నికి అంకితం చేయబడ్డాయి. ఈ ముగ్గురిని ఆదర్శంగా గ్రహించి దాశరధి తన వ్యక్తిత్వంతో పాటుగా, కవిత్వాన్ని కూడా పునీతం చేసాడు. బుద్ధుని వారసునిగా గాంధీజీని అభివర్ణిస్తాడు.
‘‘ అంటరానివారలమని అలమటించు / పంచముల హరిజనులని పాంచజన్య / మూది పలికిన హరిజనాభ్యుదయవాది / గాంధి మహనీయుడే లోకబాంధవుడు’’  అని గాంధీ సుగుణాన్ని వర్ణించాడు.

ముకిళిత పద్మాలను వికసింపచేసి లోకానికి వెలుగులు పంచే లోకబాంధవుడు సూర్యుడు. అలాగే గాంధీ మహా త్ముడు కూడా ముడుచుకుపోయిన మానవ హృదయ పద్మాలను వికసింపచేసి, విజ్ఞాన వెలుగులు పంచాడనే భావాన్ని వ్యక్త పరచాడు. ఈ గాంధేయవాది విప్లవాన్ని హింసతో కంటే ప్రేమతోను, త్యాగంతోను సాధించ వచ్చునని నమ్ముతాడు.
 నీగ్రోపై ‘‘నల్లనివాడ జ్ఞాన నయనమ్ములవాడ’’ అంటూ పోతన శైలిలో పద్యం చెప్పిన నవనీత హృద యుడు మన దాశరథి. ఇతనికి యుద్ధాలూ, మతోన్మా దాలు, మారణెమాలే గిట్టవు. అణ్వస్త్రపు గ్రీష్మానికి ప్రతీ పద్యం ఒక మబ్బుపింజ కావాలని ఇతని ఆకాంక్ష. అంత:కలహాలు పనికి రావు, అంతరంగ బంధాలు, అనురాగ రాగాలు కావాలి అని ఐక్యతా సంగీతాన్ని వినిపిస్తాడు.

పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, మహాబోధి, గాలిబ్ గీతాలు , మొదలైన రచనలు చేసి ఎన్నో సన్మానాలు, జాతీయ స్థాయి అవార్డులతో సత్కరింపబడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిపీఠాన్ని అలం కరించాడు. ‘‘నా జీవితమే నా పోరాటం, ఎన్నో ప్రతీప శక్తులతో పోరాడాను, పోరాడగలను, నేను ఆశావాదిని. దురాశావాదులు నిరాశపడతారు. ఆశావాదికి నిరాశ లేదు. నమ్రతతో నా దారిన నేను పయనిస్తాను. నా గమ్యం ప్రపంచ శాంతి, నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం. జనం మనం మనం జనం, జనం లేక మనం లేము’’ అని నుడివిన దాశరధి జనం తానుగా తాను జనంగా బతికిన మానవతావాది, శాంతి కాముకుడు. ఆయన తెలుగువారి గుండెల్లో  నిలిచిన ‘కళాప్రపూర్ణుడు’, సాహిత్య భగీరథుడు.

యమ తర్పణం నరక చతుర్దశి

యమ తర్పణం నరక చతుర్దశి

శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి 'నరక చతుర్దశి' అనే పేరు వచ్చింది. ఆశ్వియుజ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందుగానే నువ్వులు నూనెతో అభ్యంగన స్నానం చెయ్యాలి. స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి.

శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి 'నరక చతుర్దశి' అనే పేరు వచ్చింది. ఆశ్వియుజ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందుగానే నువ్వులు నూనెతో అభ్యంగన స్నానం చెయ్యాలి. స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి. ఇక్కడ చంద్రోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది. అప్పటికి ఒక గంట లోపు మాత్రమే, రాత్రి సమయం ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని " గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం).

దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మిదేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. “సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః, మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః” ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం.

నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తలపై పెట్టుకుని, పదునాలుగు నామాలతో, తిలలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి. 1. యమాయ నమః 2. మృత్యువేనమః 3. వైవస్వతాయనమః 4. సర్వభూతక్షయాచ నమః 5. ధ్ధ్నాయనమః 6. పరమేష్టినే నమః 7. చిత్రాయ నమః 8. ధర్మరాజాయ నమః 9. అంతకాయ నమః 10. కాలాయ నమః  11. ఔదుంబరాయ నమః 12. నీలాయ నమః 13. వృకోదరాయ నమః 14. చిత్రగుప్తాయతే నమః -  అంటూ పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.


ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం. ఈ చతుర్దశినాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. కనుక నరక చతుర్దశినాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ, ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.

“చతుర్దశ్యాం తు యే దీపాన్‌,
నరకాయ దదాతి చ|
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్‌ స్వర్గ మాప్నుయుః|| అంటూ చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు.

దీపావళి పండుగ ఎలా వచ్చింది ?

దీపావళి పండుగ ఎలా వచ్చింది ?

పిల్లలూ! దీపావళి పండుగ అంటే మీకు చాలా ఇష్టం కదూ! దీపావళి వచ్చిందంటే మీ కళ్ళలో వెలిగే సంతోషం ముందు కోటి మతాబుల వెలుగు కూడా దిగదుడుపే. స్కూల్ లేకపోయినా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపడం కొంచెం కష్టమే అయినా అలమరలో దాచుకున్న టపాసులు గుర్తుకు రాగానే నిద్రమత్తు ఇట్టే వదిలిపోతుంది.

తల స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కొత్త బట్టలు తొడుక్కుని, నాన్న కొని తెచ్చిన టపాసులను తీసుకుని మేడ మీదకు వెళ్ళి వాటిని కాలుస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరి మిమ్మల్ని ఇంత ఆనందపెడుతున్న దీపావళి ఎలా వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.

రామాయణం గురించి మీరు వినే ఉంటారు. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరధుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు.

ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.

మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరి చేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.