Monday, December 24, 2018

కంకంటి పాపరాజు

కంకంటి పాపరాజు:

కంకంటి పాపరాజు 18 వ శతాబ్దికి చెందిన ఉత్తమ కవి.. ఆయన నెల్లూరు మండలం వారు. మదన గోపాల స్వామీ భక్తులు. చతుర్విధ కవితా నిపుణులు.. గణిత శాస్త్ర రత్నాకరులు.

 చేమకూర వెంకటకవి తర్వాతః మంచికవిగా పెర్కొనవలసినవారు పాపరాజు మాత్రమె'' అని కొందరు పండితుల భావన. పాపరాజు 'విష్ణుమాయావిలాసం '' అనే యక్షగానం రచించారు. ''ఉత్తర రామాయణం '' అనే ఉత్తమ గ్రంధం ద్వారా పాపరాజు కవిగా ప్రసిద్దికేక్కారు. అంతే కాకుండా వీరు తన రెండు గ్రంధాలు తన ఇస్తా దైవమైన నందగోపాల స్వామికి అంకితం ఇచ్చారు. కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణాన్ని మరింకేవ్వరు రాయలేరన్న విధంగా రచించారు.

జీవిత విశేషాలు:

ఆయన ముత్తాత పేరు కంకంటి వల్లభ మంత్రి. తాత పేరు అయ్యన మంత్రి. తండ్రి పేరు అప్పయ మంత్రి. తల్లి పేరు నరసమాంబ. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

అన్ని జన్మలలో ఉత్తమమైనది మానవ జన్మ అని, విద్యాబుద్ధులు నేర్చుకున్న కవి శ్రీ రామచంద్రమూర్తి దివ్య చరిత్ర ను పాడి కీర్తించక పోతే అట్టి పురుషుని జన్మ నిరర్ధకమని ఆయన రాసిన ఉత్తర రామాయణం లో పాపరాజు గారు పేర్కొన్నారు.

తన కృతి కి తగ్గ కృతి భర్త ను వెతుకుతుండగా, కలలో మదన గోపాల స్వామి కనిపించి, " ఇంతకు ముందు నాకు అంకితమిచ్చిన యక్షగానం లాగా ఉత్తర రామాయణంను కూడా తనకే అంకితం ఇవ్వమని, తద్వారా నీకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి " అని చెప్పి అంతర్థానం అయ్యారు.

వారు అలాగే ఉత్తర రామాయణం రాసి, మదన గోపాల స్వామికి అంకితం ఇచ్చారు.

తెలుగు సాహిత్యంలో చదవదగిన గ్రంధాలలో కంకంటి పాపరాజకృత ఉత్తర రామాయణ కావ్యం మరువరానిది. సరళమైన భాషతో ధారాళమైన శైలితో హృదయావర్జకమైన రీతితో వ్రాయబడిన యీకావ్యం కవితా ప్రియంభావులైన పాఠకులకు మరపురాని మహత్తర కావ్యం. కరుణ రసార్ద్రమైన సీతా పరిత్యాగ ఘట్టం పాఠకులకు కన్నీరు నించుచు రసానంద తుందిలమై
యొప్పారు చున్నదనుట యదార్ధము

ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్

ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించారు పాపరాజు.

లక్ష్మణుడు చెప్పిన వార్త విన్న సీత పరిస్థితిని యిలా వర్ణించాడా కవి:

ఊరక వెక్కివెక్కి యేడ్చుచు, నేడుపు విడిచి మౌనంబు పూనుచు, మౌనంబు మాని తనలో దా నగుచు, నగవుడిగి తల యూచుచు, దల యూచుట విడిచి ముక్కుపై వ్రేలు గీలుగొలుపుచు, జాలిగొని హాహాకారంబు సలుపుచు, దలపని తలపులివిగో! చూచితే? లక్ష్మణా! యని యతని దిక్కు చూడ్కులు నిగిడించి యిట్లనియె:

అడలకు మన్న! నీకు వసుధాధిపునానతి దాట వచ్చునే?
యిడుముల జెందుమంచు విధి యీ ధర నన్ను సృజించి యుండగా
గడవగ నెవ్వరోపుదురు? కానల కేగిననాడె యాపదల్
గడచితి నంచు నుంటి; నెఱుగన్ దుది నిట్లగు నంచు నా మదిన్

కళవళమంది తెల్పితివొ? కాక పరాకున దప్ప వింటివో?
కల నయినన్ రఘూద్వహుడు కానలలో నను ద్రోయ బంచునే?
తెలిసి గణింపు లక్ష్మణ! మతిభ్రమ యైనదొ? హా! సహింపు మి
ప్పలుకు; లెఱుంగ కంటి; వెత బాటిలె; నీకొక భ్రాంతి యున్నదే!

కవి చిత్రించిన యీ దృశ్యానికి వ్యాఖ్యానమక్కరలేదు. కనులముందర కదలాడి కనులలో నీరు చేరక మానదు. లక్ష్మణా నీకు మతికాని భ్రమించ లేదు కదా అని, మళ్ళీ అంతలోనే, నన్ను క్షమించు, బాధలో అలా అన్నాను కాని నీకు భ్రాంతి కలగడమేమిటని మరింత శోకమగ్న అయిన జానకీదేవి యిలా అంటుంది:

ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును; నన్నిక రామచంద్రుడున్
గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణ మేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు; నాదు మే
నున్నది; చెంత గంగమడు గున్నది; యైనటు లయ్యెడున్ దుదిన్

రామునికి "చెవులారాగ" తన స్థితిని చెప్పమంది సీత. ఆమె మనసులోని ఉద్వేగమంతా ఆ ఒక్కమాటలో వ్యక్తం చేసారు పాపరాజు! రాముడు తనని వదిలేసాడన్న బాధకన్నా, తనకి ఒక్కమాటకూడా చెప్పకుండా పంపించేసాడన్న బాధే సీత మనసుని ముక్కలుచేసింది.

ఎఱగని మూఢులాడుకొను నెగ్గులకున్ భయమంది, యప్పుడే
కఱకుమనంబుతో విభుడు కాననసీమకు బంచెగాక; య
త్తెఱ గొకసారి నన్ బిలచి, తెల్పి, మనోవ్యథ దీర్చి, నిన్ను నే
మఱనని బంపడయ్యె; నభిమానము గూర్మియు నెందుబోయెనో!

దీనికి రాముని దగ్గర సమాధానం లేదు!

ఈ నాతి కౌనుతో ఎనకాక కాబోలు సింగముల్ గుహలలో చిక్కుటెల్ల/ ఈ బాల నడలతో ఎనకాక కాబోలు ఏనుంగు లడవిలో ఈగుటెల్ల/ ఈ చెల్వ చూడ్కిడో ఎనకాక కాబోలు సారంగముల్ పొదల దూరుటెల్ల/ ఈ కన్య ఘనవేణి ఎనకాక కాబోలు నహులు పుట్టలు సొచ్చి అడగుటెల్ల/ ఈ నెలత చేరి కాబోలు ఇంచువింటిచెం చతనుడయ్యు జగము జయించుటెల్ల/ ఈ లలన సృష్టి సేసి కాబోలు పంకజాసనుడు విశ్వమున స్రష్ట అగుట ఎల్ల’ - మయుడి వెనక నడుస్తూ వస్తూన్న అతగాడి కూతురు ‘మందోదరి’ని చూసిన రావణుడి మనసులో తలెత్తిన భావాలను కంకంటి పాపరాజు వర్ణించిన తీరిది. ‘ఉత్తరరామాయణ’ కావ్యం ప్రౌఢిమను పట్టి చూడడానికి - ఎత్తుగీతితో కూడిన ఈ సీసం అనే - మెతుకు ఒక్కటి చాలదూ? అందగత్తెల్ని సింహమధ్యలుగా వర్ణించడం ప్రచురం. మందోదరి సన్నని నడుముతో పోటీపడలేక, మొహం చెల్లక, సింహాలు గుహల్లో దాక్కున్నాయట. గజగమనలుగా సుందరీమణులను వర్ణించడం మరో ప్రసిద్ధ ఉపమానం. మందోదరి హొయలుతో పోటీపడలేక, ఏనుగులు అడవులు పట్టి పోయాయంటన్నాడు కవి. సుందరీమణుల కన్నుల్ని లేడి కన్నులతో పోలుస్తారు. మందోదరి చూపులతో పోటీపడలేక, జింకలు అడవులు పట్టి పోయాయంటున్నాడు కవి. సుందరీమణుల జడలను పాములతో పోలుస్తారు. మందోదరి జడతో పోటీపడలేక, పాములు పుట్టల్లో దూరి పోయాయంటున్నాడు కవి. ఈమె సాయంతోటే కాబోలు చెరకువింటి వేటకాడు మన్మథుడు ప్రపంచాన్నంతటినీ జయిస్తున్నాడు - ఈమెని సృష్టించినందువల్లనే ఆ బ్రహ్మదేవుడికి విశ్వసృష్టికర్త అనే పేరు వచ్చింది కాబోలనుకున్నాడట రావణుడు. అహల్యా, సీతా, కుంతీ, ద్రౌపదులతోపాటు పంచకన్యల్లో ఒకామె మందోదరి. ఆమె అంత అందగత్తె అన్నమాట! ఈ మందోదరే, మండోదరి పేరిట తెలుగులో ప్రసిద్ధ.
తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసి ఆరున్నర శతాబ్దాలు గడిచిన తర్వాత, తిరిగి ఉత్తర రామాయణాన్ని రాయడానికి తలపెట్టిన కంకంటి పాపరాజు నిజంగానే సాహసి. శిల్ప సంవిధానంలో పారంగతుణ్ణయి నిర్వచనోత్తర రామాయణ రచనకు పూనుకుంటున్నానని చెప్పుకున్నాడు తిక్కన. ఒక్క వచనం ముక్కయినా రాయకుండా, ఉత్తర రామాయణాన్ని చెప్పిన దిట్టతనం ఆయనది. ఇక, సంస్కృతంలో ఉత్తర రామకథను భవభూతి కరుణ రసాత్మకమయిన నాటకంగా రాశాడు. అదే ఉత్తర రామచరితం. ‘ఏకో రసః కరుణ ఏవ’ అని తాను దర్శించి, మన చేత దర్శింప చేసేందుకే భవభూతి ఈ నాటకం రాశాడంటారు. ‘వరుసం తిక్కనయజ్వ నిర్వచన కావ్యంబై తగం చేసె నుత్తర రామాయణ మందున స్మరి ప్రబంధం పూని నిర్మించుటే సరసత్వంబని ప్రాజ్ఞులార నిరసించంబోకుడీ రాఘవేశ్వరు చారిత్రము లెంద రెన్నిగతుల న్వర్ణించినం క్రాలవే?’ అని తనను తాను సమర్థించుకున్నాడు పాపరాజు. ‘మరలనదేల రామాయణమని’ అడక్కుండానే దానికి సమాధానం చెప్పేశాడు పాపరాజు. కంకంటి తన ప్రయత్నంలో గొప్ప సఫలుడయ్యాడని వీరేశలింగం, నోరి నరసింహశాస్ర్తీ తదితర పండితులూ విమర్శకులూ ప్రశంసించారు. వాస్తవానికి - నోరి వారన్నట్లుగా - తెలుగు సంప్రదాయ కవితలో ఉత్తరామాయణమంటే, కంకంటి ప్రబంధమే గుర్తుకొస్తుంది తప్ప తిక్కన రచన తలపునకు రాదు!
‘అక్కడక్కడ గొన్ని వ్యాకరణ దోషములున్నను, మొత్తము మీద నీతని కవిత్వము మిక్కిలి రసవంతమయిన’దని ఉదారంగానే పాపరాజు రచనా రీతికి యోగ్యతాపత్రం ఇప్పించారు వీరేశలింగంగారు. కానీ, శబ్దరత్నాకర కర్త మాత్రం పాపరాజును నాలుగో తరగతి కవిగా పరిగణించడానికి వెనకాడలేదు. అయితే, కృష్ణదేవరాయలు, చేమకూర వెంకటకవి, కూచిమంచి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి, పొన్నిగంటి తెలగన్నలతోపాటు పాపరాజుకు ‘సహశ్రోత’ అయిన పుష్పగిరి తిమ్మన్నను కూడా ఇదే తరగతిలో వేసి అతగాడికి ఒకింత ఊరట కలిగించారు బహుజనపల్లివారు!

 పద్యాన్ని గజ్జెల గుర్రంలా నడిపించడంలోనే కాకుండా పంచచామరం లాంటి వృత్తాలను సార్థకంగా నిర్వహించడంలో సయితం పాపరాజు అందెవేసిన చెయ్యి. బహుశా, యక్షగానం రాసి వుండిన అనుభవం వల్ల కాబోలు జంపెలను కూడా ససందర్భంగా వినియోగించాడు. ఇక, ‘హరినీలముల కప్పు, అళిజాలముల ఒప్పు, కల కొప్పు రహి మెప్పు కులుకుదాని..’ లాంటి సీసాలను శ్రీనాథుడి మూసల్లో పోసి తీశాడు పాపరాజు. ‘శరశరాసన ముసల ముద్గర కృపాణ తోమర గదాది సాధన స్తోమ పూర్తి మిక్కుటంబైన తేరెక్కి వెడలె వింశతిభుజుండు త్రైలోక్య విజయకాంక్ష’ లాంటి సందర్భాల్లో ప్రయోగించిన శైలి పాపరాజు ఔచిత్య విచారానికి నిదర్శనం.

చిత్రమేమిటంటే, తెలుగులో వచ్చిన ఉత్తర రామాయణాలు రెండూ ‘నెల్లూరు మండలం’ నుంచే వెలువడ్డాయి. ఈ రెండు ఉత్తర రామాయణాలు రాసినవాళ్లూ పెద్దపెద్ద ఉద్యోగాలు చేసిన అధికారులే. తిక్కన సరేసరి! కంకంటి పాపరాజు ప్రళయ కావేరి రేవు పట్నానికి ‘అమీను’గా ఉండేవాడట. 1760 దశకంలో ఉత్తర రామాయణం రాయక ముందే పాపరాజు ‘విష్ణుమాయా విలాసం’ అనే యక్షగానం రాశాడట. దాన్ని తన ఇలవేలుపు మదన గోపాలుడికి అంకితమిచ్చాడట. ఉత్తర రామాయణం రాయాలనే ఆలోచన పాదుకుంటున్న తరుణంలో అదే మదనగోపాలుడు పాపరాజుకి కలలో కనిపించి, ప్రబంధ పాకంలో రాయతలపెట్టిన ఆ కావ్యాన్ని తనకే అంకితమివ్వమని అడిగాడట. అప్పటికే కవిగా నిలదొక్కుకున్న పుష్పగిరి తిమ్మన్నను పిలిపించి జరిగిందంతా చెప్పుకున్నాడట పాపన్న. అది విని ఆనందించిన తిమ్మన్న ‘అన్నా! రామకథకి కృష్ణుడు రాజవడం జరిగితే, మేలిమిబంగారానికి కృతవర్ణాంచిత రత్నం అబ్బినట్లవుతుంది’ అని నోరారా అభినందించాడని పాపన్న రాసుకున్నాడు. కానీ, ‘చరిత్రకారులు’ కొందర పుష్పగిరి తిమ్మన్న నుంచే, పాపరాజు ఈ కావ్యాన్ని కొనుక్కున్నట్లు పుకారు పుట్టించి, పుణ్యం కట్టుకున్నారు. తిమ్మన్న పద్యాలు చదివిన వాళ్లు ఎవరూ ఈ ప్రచారాన్ని నమ్మజాలరు.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు
పరిశోధకులు

No comments:

Post a Comment