Friday, November 23, 2018

పరవస్తు చిన్నయసూరి


పరవస్తు చిన్నయసూరి
పరవస్తు చిన్నయ సూరి (1809-1861) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఆయన రచించిన బాలవ్యాకరణం, నీతిచంద్రిక చాలా ప్రసిద్ధి గాంచాయి. పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ అనే లోకోక్తి ఉంది. ఆయన భాషా సేవ వెనుక బ్రౌను దొర, గాజుల లక్ష్మీనరసింహశ్రేష్టి, జస్టిస్ రంగనాథశాస్త్రి, కుమారస్వామిశాస్త్రి వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఉన్నాయి. మొట్టమొదటగా సూరిని గ్రంథ రచనోద్యమమునకు పురికొల్పినవాడు లక్ష్మీనృసింహము శ్రేష్ఠి. ఆంధ్రశబ్దశాసనము, ఆంధ్రనిఘంటువు, ఆయన ప్రోద్భలంతోనే సూరి వ్రాయనారంభించెను. కాని యవి రెండూ పూర్తి కాలేదు. చిన్నయకు పేరుపొందిన శిష్యులెందరో కలరు. శబ్దరత్నాకర కర్త, ప్రౌఢవ్యాకర్తయైన బహుజనపల్లి సీతారామాచార్యులు, ఆంధ్ర విశ్వగుణాదర్శకర్త పంచాంగము తేవప్పెరుమాళ్ళయ్య ఆయన శిష్యులే.

బాల్యం

చిన్నయ సూరి తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలోని పెరంబుదూరులో జన్మించాడు. వారిది సాతాని శ్రీవైష్ణవుల కుటుంబం. ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వేంకటరంగయ్య. జన్మనామం చిన్నయ. చిన్నయ చాలా తరాలకు పూర్వం ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము ఆపస్తంబ సూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.

చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.

ఉద్యోగం, రచనా ప్రస్థానం

చిన్నయ మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనే లోకోక్తి ఉంది. అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను రప్పించి, చిన్నయను పరీ‍క్ష చేయించి, సమర్థుడని గుర్తించి, "చిన్నయసూరి" అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్ని సీమ నుండి తెప్పించి బహుమతిగా ఇచ్చాడు. సూరి అనగా పండితుడు అని అర్థం.

రచనలు

అక్షర గుచ్ఛము, ఆంధ్రకాదంబరి, ఆంధ్రకౌముది, ఆంధ్రధాతుమాల, ఆంధ్రశబ్ద శాసనము, అకారాది నిఘంటువు, ఆదిపర్వవచనము - 1847, ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము, చాటు పద్యములు, చింతామణివృత్తి - 1840, పచ్చయప్ప నృపయశోమండనము - 1845, పద్యాంధ్ర వ్యాకరణము - 1840, బాల వ్యాకరణము - 1855, బాలవ్యాకరణ శేషము, నీతిచంద్రిక - 1853, నీతిసంగ్రహము - 1855, యాదవాభ్యుదయము, విభక్తి బోధిని - 1859, విశ్వ నిఘంటువు, శబ్దలక్షణ సంగ్రహము - 1853, సుజనరంజనీ పత్రిక, సంస్కృత బాలబోధ, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము - 1844.

దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు 

1 comment:

  1. చినయ సూరి మనుమడే, పూరీ జగన్నాధ్ మాజీ పూజారి, నేడు విరివిగా సువార్త చేస్తూ నిజ దేవుని ప్ర్రకటిస్తోన్న పరవస్తు సూర్య నారాయణ గారు

    ReplyDelete